ఫ్రంట్కు టెంట్ కూడా దొరకదు: కేసీఆర్కు లక్ష్మణ్ కౌంటర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై బిజెపి రాష్ట్రాధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఘాటుగా స్పందించారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న బిజెపిని చూసి కేసిఆర్కు భయం పట్టుకుందని ఆయన అన్నారు.
కేసీర్ పదే పదే గుణాత్మక మార్పు అంటున్నారని, అదేమిటని ఆయన అన్నారు. దళితుడ్ని ముఖ్యమంత్రిని చేయకుంటే తల నరుక్కుంటానని ఆ తర్వాత తానే పీఠమెక్కడం, సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొనడం, రైతులకు బేడీలు వేయడం, ప్రతిపక్షాలనూ ప్రజా సంఘాలనూ నిర్బంధించడం, ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం ఇదేనా గుణాత్మక మార్పు అని ఆయన ప్రశ్నించారు
ఒక్క మాటకైనా కట్టుబడి ఉన్నారా...
గతంలో చెప్పిన ఒక్క మాటకైనా కేసీఆర్ కట్టుబడి ఉన్నారా అని లక్ష్మణ్ ప్రశ్నించారు కేంందరం ఇచ్చిన నిదులపై కేసిఆర్ చర్చకు సిద్ధమైనా అని ఆయన అడిగారు. 70 ఏళ్లలో సాధ్యం కాని అభివృద్ధిని ప్రధాని మోడీ నాలుగేళ్లలో చేసి చూపించారని, అందుకే ప్రజలు బిజెపికి బ్రహ్మరథం పడుతున్నారని ఆయన అన్నారు.
ఫ్రంట్కు టెంటు కూడా దొరకదు
దేశ ప్రజలు గతంలో కూడా ఎన్నో ఫ్రంట్లను చూశారని, సుస్థిరమైన నాయకత్వం కోసమే బిజెపికి ఓటేసి ప్రజలు మోడీని ప్రధానిని చేశారని, కేసీఆర్వాళ్లు పెట్టే ఫ్రంట్లకు టెంట్లు కూడా దొరకవని లక్ష్మణ్ అన్నారు.
వాపును చూసి బలుపు అని
వాపును చూసి బలుపుగా భ్రమిస్తు్న కేసిఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని లక్ష్మణ్ అన్నారు. ప్రధాని అనే గౌరవం కూడా లేకుండా మోడీని తిట్టారని ఆయన అన్నారు. కేసీఆర్ పొరపాటున నోరు జారాడని వారి సంతానం కేటీఆర్, కవిత అంగీకరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఆయన తప్పు ఒప్పుకుంటే...
కేసిఆర్ ఇప్పటికైనా తప్పు ఒప్పుకుంటే హుందాగా ఉంటుందని లక్ష్మణ్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానం కూడాలేని బిజెపి త్రిపురల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని అన్నారు. రేపు కర్ణాటక, ఆ తర్వాత తెలంగాణలోనూ తమదే విజయమని ఆయన అన్నారు.