కరోనా ఎఫెక్ట్ : సింగరేణి కీలక నిర్ణయం.. గనులు బంద్.. లేఆఫ్ అమలు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఒక్క సింగరేణిలో మాత్రం యథావిధిగా బొగ్గు ఉత్పత్తి కొనసాగుతూనే ఉంది. కార్మికులు విధులకు హాజరవుతూనే ఉన్నారు. అయితే ఇటీవల ఇద్దరు కార్మికులు ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చి విధులకు హాజరైనట్టు గుర్తించారు. ప్రస్తుతం బెల్లంపల్లిలోని ఆసుపత్రిలో వారిని క్వారెంటైన్ చేశారు. మర్కజ్ వెళ్లి వచ్చి విధులకు హాజరైనవారు ఇంకా ఎవరైనా ఉన్నారా అని అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం(ఏప్రిల్ 1)న సింగరేణి కీలక నిర్ణయం తీసుకుంది. సింగరేణిలో లాక్డౌన్కు బదులు లేఆఫ్ అమలు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. లేఆఫ్ పీరియడ్లో కార్మికులకు వేతనం చెల్లించడం జరుగుతుందని వెల్లడించింది.
లేఆఫ్లో భాగంగా బుధవారం రెండో షిఫ్ట్ నుంచి అండర్ గ్రౌండ్ మైన్స్ను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. భూగర్భ గనుల్లో పనిచేసే కార్మికులు సోషల్ డిస్టెన్స్ పాటించే అవకాశం లేకపోవడంతో.. కార్మికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఓపెన్ కాస్ట్ మైన్స్తో పాటు మెషీన్ మైన్స్ కూడా యథావిధిగా కొనసాగనున్నాయి.ఏఎల్పీ, వీకే-7, శాంతి ఖని, జీడేకే-11ఏ ఇంక్లైన్, కొండాపూరం గనులు యథావిథిగా నడుస్తాయని సర్క్యులర్లో పేర్కొన్నారు. ఉత్పత్తి జరిగే గనుల్లో కరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.