66వ వడిలోకి కేసీఆర్, ఉద్యమ నేత నుంచి ముఖ్యమంత్రి వరకు, తెలంగాణ విధాత ప్రస్థానం
Recommended Video
కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. కేసీఆర్గా సుపరిచితం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీ రోల్ పోషించిన ఉద్యమనేత. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన యోధుడు. చావు నొట్లో తలపెట్టి మరీ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. అధికార కాంగ్రెస్ పార్టీని ఒప్పించి, ప్రతిపక్షాలను మెప్పించి.. తెలంగాణ ప్రజల ఆశ, శ్వాస అయిన తెలంగాణ రాష్ట్రాన్ని సగర్వంగా సాధించారు. సోమవారం కేసీఆర్ జన్మదినం. 66వ వడిలోకి అడుగిడుతోన్న కేసీఆర్పై వన్ ఇండియా ప్రత్యేక కథనం.
నేపథ్యం..
మెదక్ జిల్లా చింతమడకలో 1954 ఫిబ్రవరి 17వ తేదీన రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు కేసీఆర్ జన్మించారు. ఎగువ మానేరు డ్యాం నిర్మాణంలో కేసీఆర్ కుటుంబం భూమి కోల్పోయి చింతమడకకు వచ్చి కేసీఆర్ కుటుంబం స్థిరపడింది. సిద్దిపేటలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. ఉస్మానియా వర్సిటీలో ఎంఎ తెలుగు చదివారు. 1969లో శోభతో కేసీఆర్ వివాహామైంది. వీరికి ఇద్దరు పిల్లలు కేటీఆర్, కవిత ఉన్నారు. కేటీఆర్ మంత్రిగా పనిచేస్తుండగా, కవిత గత ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ నుంచి ప్రాతినిధ్యం వహించారు.
రాజకీయాలపై ఆసక్తి..
విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో కేసీఆర్టీ యాక్టివ్గా ఉండేవారు. కాంగ్రెస్ నేత అనంతుల మదన్ మోహన్ కేసీఆర్కు రాజకీయ గురువు. 1970లో కేసీఆర్ కాంగ్రెస్ యువజన నేతగా పనిచేశారు. కానీ 1982లో ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ను వీడి టీడీపీలో చేరారు. 1983లో తన రాజకీయ గురువు మదన్ మోహన్పై పోటీ చేసి గట్టి పోటీనిచ్చారు. కేవలం 877 ఓట్లతో ఓడిపోయారు. అలా కేసీఆర్ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 1985లో టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.
ఓటమి ఎరుగని ధీరుడు..
1989, 1994, 1999 ఎన్నికలు, 2001 ఉప ఎన్నికల్లో వరసగా విజయం సాధించారు. 1987లో మంత్రివర్గంలో చోటు దక్కింది. 1992-93లో పబ్లిక్ అండర్ టేకింగ్ చైర్మన్గా విధులు నిర్వహించారు. 1997లో క్యాబినెట్ హోదా వరించింది. 1999 నుంచి 2001 వరకు ఉమ్మడి రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. 1999లో మంత్రివర్గంలో చంద్రబాబు నాయుడు చోటు కల్పించకపోవడంతో కేసీఆర్ అసంతృప్తికి గురయ్యారు.
రాజీనామా..
టీడీపీతో అంటిముట్టగట్టుగానే వ్యవహరిస్తూ.. వచ్చారు. 2001 ఏప్రిల్ 21వ తేదీన టీడీపీ, డిప్యూటీ స్పీకర్ పదవీకి కేసీఆర్ రాజీనామా చేశారు. 2001 ఏప్రిల్ 27వ తేదీన ప్రత్యేక రాష్ట్రం నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్తో కలిసి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించారు. 2001లో ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఏర్పడటంతో.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అసాధ్యమేమీ కాదనే అభిప్రాయానికి కేసీఆర్ వచ్చారు. అలా ప్రజల్లోకి వెళ్లి ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని తీసుకెళ్లారు. 2001 మే 17వ తేదీన తెలంగాణ సింహగర్జన పేరుతో బహిరంగ సభ ఏర్పాటు చేసి.. రాజకీయ పోరాటం ద్వారా తెలంగాణ సాధిస్తామని ప్రకటించారు.
ఘన విజయం..
2004లో కరీంనగర్ లోక్సభ నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఐదుగురు ఎంపీలతో టీఆర్ఎస్ పార్టీ యూపీఏ కూటమిలో భాగస్వామిగా చేరింది. కేసీఆర్, ఆలె నరేంద్రకు కేంద్ర మంత్రి పదవులు వరించాయి. 2004 నుంచి 2006 వరకు కేంద్ర కార్మికశాఖ మంత్రిగా కేసీఆర్ పనిచేశారు. తర్వాత మంత్రి పదవీకి రాజీనామా చేసి యూపీఏ నుంచి కేసీఆర్ బయటకొచ్చారు. ఎంపీ పదవీకి కూడా రాజీనామా చేసి.. ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. 2008లో కూడా ఉప ఎన్నికల్లో జయకేతనం ఎగరవేశారు.
నిరాహార దీక్ష..
కేసీఆర్ రాజకీయ జీవితంలో పెద్ద మలుపు.. తెలంగాణ రాష్ట్రం కోసం చేపట్టిన నిరాహార దీక్ష. 2009 నవంబర్ 29వ తేదీన తెలంగాణ కోసం కరీంనగర్ నుంచి సిద్దిపేట బయల్దేరగా కరీంనగర్ వద్ద గల అల్గునూర్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మం తరలించారు. కేసీఆర్ దీక్ష భగ్నం చేసి ఖమ్మం సబ్ జైలుకు తరలించి రెండురోజులు బంధించారు. జైల్లో కూడా కేసీఆర్ నిరహార దీక్ష చేపట్టారు. అక్కడినుంచి నిమ్స్ తీసుకొచ్చినా దీక్షను కంటిన్యూ చేశారు.
తెలంగాణ ఏర్పాటు ప్రకటన..
దీక్షతో కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రక్రియను ప్రారంభిస్తోందని ప్రకటన విడుదల చేసింది. అయితే సీమాంధ్ర లాబీయింగ్తో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం శ్రీ కృష్ణ కమిటీని ఏర్పాటు చేశారు. రెండేళ్ల తర్వాత కమిటీ నివేదిక సమర్పించడంతో.. అటు ఆంధ్రలో ఆందోళనలు కొనసాగుతోన్న.. ప్రజల ఆకాంక్ష మేరకు యూపీఏ ప్రభుత్వం 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది.
సీఎంగా రెండోసారి..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరుణంలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. ముఖ్యమంత్రి పదవీని కేసీఆర్ అదిష్టించి.. రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఇమేజీ మరింత పెరిగింది. 2018లో ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్లారు. ఆ ఎన్నికల్లో కూడా ప్రజలు మరోసారి టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించింది. ఉప ఎన్నికలే కాదు.. ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ అప్రతిహాత జైత్రయాత్ర కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో గులాబీ గుబాళిస్తూనే ఉంది.