తెలంగాణలో తెలుగుదేశం పార్టీలోకి చేరికలు, రేవంత్ రెడ్డి ఉత్సాహం
తెలంగాణ టిడిపిలో పలువురు నాయకులు చేరారు. ఓటుకు నోటు అనంతరం తెలంగాణలో టిడిపి పరిస్థితి దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో టిడిపిలో పలువురు నాయకులు చేరడం గమనార్హం.
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీలో పలువురు నాయకులు చేరారు. ఏపీలో అధికారంలో ఉన్న టిడిపిలోకి వలసలు మామూలే. ఓటుకు నోటు అనంతరం తెలంగాణలో టిడిపి పరిస్థితి దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో టిడిపిలో పలువురు నాయకులు చేరడం గమనార్హం.
మజ్లిస్ పార్టీకి చెందిన జీవీజీ నాయుడు పలువురు కార్యకర్తలతో శనివారం టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి ఉత్సాహంగా మాట్లాడారు.
హైదరాబాద్లోని పాత నగరాన్ని మజ్లిస్, కొత్త నగరాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ పంచుకున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇరు పార్టీలు లోపాయికారీ ఒప్పందాన్ని కుదుర్చుకొని అభ్యర్థుల్ని నిలబెట్టాయని మండిపడ్డారు.
ముస్లిం మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి నెరవేర్చని సీఎం కేసీఆర్ను మజ్లిస్ నేతలు ఎందుకు నిలదీయడంలేదని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ సెల్ఫీలు దిగడంలో, కేసీఆర్ గొప్పలు చెప్పుకోవడంలోనే బిజీగా ఉన్నారన్నారు.హైదరాబాద్కు పూర్వ వైభవం రావాలంటే టిడిపి వల్లే సాధ్యమన్నారు. చంద్రబాబు హయాంలోనే హైదరాబాద్ నగరం బాగా అభివృద్ధి చెందిందన్నారు. ప్రస్తుత కేసీఆర్ ప్రభుత్వం భాగ్యనగరాన్ని అప్పులపాల్జేస్తోందన్నారు.
కాంగ్రెస్ నేతలపై పల్లా
అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న నిర్ణయం తర్వాత కూడా కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని తెరాస నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ప్రజల కోసం సమావేశాలు పెడుతున్నాం తప్ప కాంగ్రెస్ కోసం కాదన్నారు.
తాము రాజకీయాల్లో బచ్చా కావచ్చునేమో కానీ, ఉద్యమంలో మాత్రం కాదన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను అసెంబ్లీలో వివరిస్తామన్న ఆయన ఏవైనా సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే విపక్షాలు సరైన వివరాలతో సభకు రావాలని కోరారు.