డిఎస్తో చెత్త పోయింది: యాష్కీ, కాంగ్రెస్ 'షాడో', కెసిఆర్ మాట తీరు గమనిస్తున్న పారిశ్రామికవేత్తలు
హైదరాబాద్: వర్షాకాల విడిది కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీరిక లేకుండా గడుపుతున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆయనతో భేటీ అవుతున్నారు. వివిధ అంశాలపై చర్చిస్తున్నారు.
సోమవారం నాడు పలువురు భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారని సమాచారం. తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే కోనప్ప రాష్ట్రపతిని కలిశారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. ఆదిలాబాద్లో కాందిశీకుల సమస్య పరిష్కరించాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. గోదావరి పుష్కరాలకు హాజరు కావాలని ఆయనను ఆహ్వానించామన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఇతర కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతితో భేటీ అయ్యారు.
రాష్ట్రపతితో భేటీ అనంతరం పొన్నాల మాట్లాడుతూ.. ఇద్దరు ముఖ్యమంత్రుల పాలనపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్పై గవర్నర్ అచేతనంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు కూడా రాష్ట్రపతిని కలవనున్నారు.
మహారాష్ట్ర సీఎం కోసమే డిజైన్ మార్పు: షబ్బీర్ అలీ
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనికిరానిదే అయితే జాతీయ ప్రాజెక్టు హోదా ఎందుకు కోరుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు. మహారాష్ట్ర సీఎం కోసమే ప్రాజెక్టు డిజైన్లో మార్పు చేస్తున్నారన్నారు. ప్రాజెక్టుల కోసం వేల కోట్లు ఖర్చయ్యాయని గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు.
డిఎస్పై యాష్కీ నిప్పులు
డి శ్రీనివాస్ పార్టీ నుండి వెళ్లిపోవడంతో కాంగ్రెస్ పార్టీ నుండి చెత్త వెళ్లిపోయినట్లయిందని ఆ పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ అన్నారు. డీఎస్ వెన్నుపోటుదారు అన్నారు. డిఎస్ వెళ్లినా పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. తెలంగాణ కోసం మేం చేసిన పోరాటాన్ని ప్రణబ్ గుర్తు చేశారన్నారు.
ఓటుకు నోటు అంశాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకు వెళ్లామని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇద్దరు సీఎంలకు హితవు చెప్పాలని కోరినట్లు తెలిపారు.
ప్రభుత్వ పథకాలపై కాంగ్రెస్ షాడో కమిటీ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల పైన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ షాడో కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వాల హామీల పర్యవేక్షణను ఈ కమిటీ చూస్తుంది. పథకాల తీరు, అవతకవకల పైన శాఖల వారీగా ఎప్పటికప్పుడు షాడో కమిటీ పరిశీలిస్తుంది. పదిమంది సీనియర్ నేతలతో షాడో కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్గా సురేష్ రెడ్డి ఉంటారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీల అమలులో విఫలమయ్యాయన్నారు. విభజన చట్టంలోని హామీలను కేంద్రం విస్మరిస్తోందని చెప్పారు. వాటి గురించి రాష్ట్రం అడగటం లేదు, కేంద్రం ఇవ్వడం లేదన్నారు.
మాట తీరు మార్చుకో: సురేష్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ జాగో బాగో మాటలను వదిలేయాలని మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి హితవు పలికారు. మీ మాట తీరు, పనితీరును పెట్టుబడిదారులు జాగ్రత్తగా గమనిస్తున్నారన్నారు. ఫుల్ టీం ఉన్నా ఇతర పార్టీల నేతలను ఆకర్షించడం తగదన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న టీఆర్ఎస్.. వికెట్లను వెంటవెంటనే కోల్పోతోందని ఎద్దేవా చేశారు.