తెలంగాణ కౌలు రైతుల కష్టాలు పట్టని ముఖ్యమంత్రి..
తెలంగాణలో కౌలు రైతు కష్టాలు రెట్టింపు అయ్యాయి. పంట సరిగా పండక, ప్రభుత్వ పథకాల్లో ఆర్హత లేక ఇబ్బందులకు గురౌతున్నారు. దీనికి తోడు కౌలు రైతుల పట్ల ప్రభుత్వం ఎలాంటి సానుకూల నిర్ణయం తీసుకోకపోవడంతో దిక్కు తోచని పరిస్థితిలో పడ్డారు తెలంగాణ కౌలు రైతులు. రైతు బందు పథకం లాంటి ప్రత్యక్ష ప్రయోజనం చేకూరే పథకం తమకు కూడా కావాలని డిమాండ్ చేస్తున్నప్పటికి పట్టించుకునే నాథుడు కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కౌలు రైతలు.
భూస్వాముల కోసమే రైతు బంధు పథకం అంటున్న కౌలు రైతులు..
రైతు బంధు స్కీంపైన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వైఖరి ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది. ఎకరానికి నాలుగు వేల రూపాయల సాయం చేస్తు అన్నదాత అభిమానాన్ని ఆయన పొందుతున్నారు.భూమి ఉన్న ప్రతి రైతుకు చెక్ లు పంపించిన కేసీఆర్ కౌలు రైతు విషయంలో మాత్రం చాలా కఠినంగా వ్యవహారిస్తున్నారు. గుంట భూమి నుంచి అరవై ఎకరాల బడా భూస్వామి వరకు రైతు బంధులో సాయం అందుతోంది. ఒక్కొక్కొ భూస్వామ్య కుటుంబం లక్షల్లో ప్రభుత్వ డబ్బును ఈ స్కీం ద్వారా ఆయాచితంగా అందుకుంది.
వీరి సంఖ్య తక్కువే ఉండొచ్చు. కాని వీరు అందుకున్న మొత్తం తక్కువేమీ కాదు. దీనికి తోడు ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు స్వేచ్ఛగా ప్రభుత్వ సాయాన్ని అందుకున్నారు.మళ్ళీ కూడా ఇదే రకంగా నవంబర్ లో చెక్ లను వీరంతా అందుకోనున్నారు.
ఎందుకు చిన్న చూపని ప్రశ్నిస్తున్న కౌలు రైతులు..
దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇందుకోసం ఖర్చు చేస్తోంది. రైతులకు సాయం చేయాలన్న ఆలోచన మంచిదే. కాని ఆయాచిత సాయంపైనే చర్చ అంతా. మరో వైపు కౌలు రైతుల విషయంలో చంద్రశేఖర్ రావు తీరు చాలా అసహనాన్ని కల్గించేలా ఉంది. భూమిలేని వారికి డబ్బులెలా ఇస్తామంటు ఆయన ఖరాఖండిగా చెపుతున్నారు. ఏ హక్కు లేని వారికి ప్రభుత్వ సొమ్ము ఎలా ఇస్తామని చంద్రశేఖర్ రావు ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు ఎవరికి పడితే వారికి డబ్బుల పంచడం సాధ్యం కాదన్నది కేసీఆర్ వాదన. అసలు కౌలు రైతు ఎవరు అన్న పెద్ద సందేహాన్నిఆయన వ్యక్తం చేస్తున్నారు. కౌలు రైతు ఎలా ఉంటాడు, ఆయన రంగు,రుచి వాసన ఎలా ఉంటుందో కూడా ప్రభుత్వానికి తెలియదని చంద్రశేఖర్ రావు బల్లగుద్ది చెపుతున్నారు.
కౌలు రైతులను ఆదుకోవాలనే డిమాండ్ బలపడుతోంది.
కాని ఒక రాష్ట్ర అధినేత కేవలం సాంకేతిక,న్యాయపరమైన అంశాల కోణంలో మాత్రమే పనిచేయడం సరైనది కాదు. భారత్ లాంటి దేశంలో ఇలాంటి పరిపాలన ప్రజలకు పూర్తి న్యాయం చేయలేదు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాల్సిందే. కొన్ని సార్లు పరిధులు దాటి మరి పాలకులు వ్యవహారించాల్సి ఉంది. రైతులకు 12 వేల కోట్ల రూపాయలు పంచిన చంద్రశేఖర్ రావు కౌలు రైతులకు, రైతు కూలీలకు ఏదో ఒక రకంగా న్యాయం చేయవచ్చు. అంతో ఇంతో భూమి ఉన్న వారిని ఆదుకున్నప్పుడు ఏ ఆసరా లేని వారికి సాయం చేస్తే ఏ కోర్టులు వద్దంటాయి.
భూస్వాములకు లక్షల రూపాయల చెక్ లు ఇచ్చినప్పుడు మట్టినే నమ్ముకున్న అభాగ్యులకు అండగా నిలిస్తే ఏ చట్టం అడ్డుకుంటుంది.గతంలో కౌలు రైతులకు ప్రభుత్వాలకు గుర్తింపు కార్డులు ఇచ్చిన విషయం కేసీఆర్ కు తెలియనిది కాదు. కౌలు రైతులకు బ్యాంక్ ల ద్వారా రుణాలు ఇప్పించడానికి జరిగిన ప్రయత్నాలు కూడా ఆయన ద్రుష్టికి వచ్చే ఉంటాయి.
ముఖ్యమంత్రి వైఖరిలో మార్పురావాలంటున్న కౌలు రైతులు..
వందేళ్ల తర్వాత రైతుల భూ రికార్డులను ప్రక్షాళన చేయిస్తున్న చంద్రశేఖర్ రావు కు కౌలు రైతులను గుర్తించడం పెద్ద పనేమీ కాదు. కోళ్లు, కుక్కలను వదిలిపెట్టకుండా సమగ్ర సర్వేతో అన్ని వివరాలను సేకరించగల్గిన కేసీఆర్ కు రైతు కూలీలను కనిపెట్టడం పెద్ద విషయమా..? గ్రామాల్లో భూములున్న కుటుంబాలను, లేని వారిని విడగొట్టడం ఇంత పెద్ద వ్యవస్థకు సాధ్యం కాదా..? రైతుల స్థాయిలో కాకపోయినా కౌలు రైతులకు ఎంతో కొంత మొత్తాన్ని ప్రభుత్వం అందించలేదా..? అరవై ఎకరాలున్న ఆసామికి లక్షల రూపాయల చెక్ లు ఇచ్చిన కేసీఆర్ కౌలు రైతులకు రెండకరాల కటాఫ్ తో సాయం చేయవచ్చుకదా..?
పన్నెండు వేల కోట్ల ఖర్చు చేసిన ప్రభుత్వం మరో వెయ్యి కోట్లు కేటాయిస్తే సరిపోయేది. కాని చంద్రశేఖర్ రావు మాత్రం రైతులకు మాత్రమే పరిమితం కావాలని నిర్ణయం తీసుకున్నారు.వారి ఓట్లు వస్తే చాలులే అన్న సిద్దాంతం కాబోలు అందుకే కేసీఆర్ కౌలు రైతులు ఎవరో తనకు తెలియదని బల్లగుద్ది చెప్పేశారు. మరి ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల వచ్చే ఎన్నికల్లో కౌలు రైతాంగం ఎలాంటి నిర్ణయం తెలుపుతారో చూడాలి.