కాంగ్రెస్ను వీడడానికి బలమైన కారణం ఉంది: డిఎస్
నిజామాబాద్/ మెదక్: తాను కాంగ్రెస్ను విడిచి పెట్టడానికి బలమైన కారణం ఉందని,పదవుల కోసం తాను ఏనాడూ పాకులాడలేదని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డి. శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ర్టానికి కేసీఆర్ తొలి ముఖ్యమంత్రి కావడం అదృష్టమనిఆయన అన్నారు.
నిజామాబాద్లో జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్ధాయి సమావేశం బుధవారంనాడు జరిగింది. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు, పెద్దఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన ప్రసంగించారు.
తెలంగాణపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు పూర్తి అవగాహన ఉందని, సీఎం కేసీఆర్తోనే బంగారు తెలంగాణ సాధ్యమని ఆయన అన్నారు. కేసీఆర్కు ప్రతీ సబ్జెక్టు మీద పూర్తి పట్టు ఉందని అధికారులతో సీఎం గంటల తరబడి సమీక్షలు చేస్తున్నారని ఆయన చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) విధానాలపై రాజీలేని పోరాటం చేస్తామని తెలంగాణ బచావత్ మిషన్ వ్యవస్థాపకుడు నాగం జనార్థన్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లాలోని దౌల్తాబాద్ మండలం ఎల్కల్లో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను నాగం బుధవారం పరామర్శించారు. అనంతరం ఆత్మహత్య చేసుకున్న 28 రైతుల కుటుంబాలకు రూ. 5వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు.
కాగా, రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి విజ్ఞప్తి చేశారు. రైతుల ఆత్మహత్యలను నివారించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.