వరంగల్లో గద్దర్ కోసం లెఫ్ట్ కుస్తీ: టిడిపి మద్దతు ఇస్తుందా?
హైదరాబాద్: త్వరలో జరిగే వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ ఉపఎన్నికలో తొమ్మిది వామపక్ష పార్టీల అభ్యర్ధిగా ప్రజా యుద్ద నౌక గద్దర్ను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని సీపీఐ, సీపీఎం పార్టీల రాష్ట్ర కార్యదర్శులు చాడా వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రం తెలిపారు.
మంగళవారం హైదరాబాద్లో వారు మీడియాతో మాట్లాడారు. గద్దర్ ను అభ్యర్ధిగా నిలబెడితే ఒక్క తెలంగాణ రాష్ట్ర సమితి మినహా అన్ని పార్టీల మద్దతు ఇస్తాయని వారు చెప్పారు. పది రోజుల్లో అభ్యర్ధిని ప్రకటిస్తామని వారు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మావోయిస్టులు కూడా వ్యతిరేకిస్తున్నారని వారు చెప్పారు.
అయితే, గద్దర్ పోటీకి దిగుతారా అనేది చెప్పలేని పరిస్థితి, గద్దర్ను పోటీకి దించితే తెలుగుదేశం మద్దతు ఇవ్వడానికి అవకాశాలున్నాయని అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును దెబ్బ తీయడానికి దాన్ని టిడిపి అవకాశంగా తీసుకుంటుందని అంటున్నారు. అలాగే, ఆ సీటుకు రాజీనామా చేసి డిప్యూటీ ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి వరంగల్ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకమైంది.
వరంగల్ జిల్లాలో కడియం శ్రీహరికి, తెలుగుదేశం తెలంగాణ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుకు మధ్య చాలా కాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కడియం శ్రీహరిని వ్యక్తిగతంగా దెబ్బ తీయడానికైనా ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఒప్పించి, గద్దర్కు మద్దతు ఇచ్చేలా చూస్తారని అంటున్నరాు. దానికితోడు, నోటుకు ఓటు కేసులో ప్రతిష్ట దిగజారిన ప్రస్తుత తరుణంలో పోటీ చేయకుండా గద్దర్ పోటీకి దిగితే మద్దతు ఇవ్వడమే మంచిదని తెలుగుదేశం వర్గాలు భావిస్తూ ఉండవచ్చు.
ఇదిలావుంటే, కాంగ్రెసు మద్దతు ఇస్తుందా అనేది ప్రశ్నార్థకం. టిడిపి మద్దతు ఇస్తే కాంగ్రెసు దూరంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ, ఉమ్మడి శత్రువుగా భావిస్తే మాత్రం మద్దతు ఇవ్వవచ్చు. కాగా, లోకసభ మాజీ స్పీకర్ మీరా కుమార్ను బరిలోకి దింపాలని కాంగ్రెసు ఆలోచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మీరా కుమార్ అంగీకరిస్తే కాంగ్రెసు బరిలోకి దిగవచ్చు.