432కోట్ల రుణం ఎగవేత!: లియోనియా రిసార్ట్స్ ఎండీ అరెస్ట్
హైదరాబాద్: శామీర్పేటలోని లియోనియా రిసార్ట్స్ ఎండీ చక్రవర్తి రాజును బెంగళూరు సీబీఐ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో అరెస్ట్ చేసిన చక్రవర్తిని నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు.
తప్పుడు పత్రాలతో బ్యాంకుల నుంచి లియో మెరీడియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రాజెక్ట్స్, హోటల్స్ లిమిటెడ్ పేరుతో జిఎస్ చక్రవర్తి రాజు మరో ఎనిమిదిమంది కలిసి రూ.432.22 కోట్లు రుణం తీసుకున్నారు. చెల్లించాల్సిన వడ్డీ, రుణాలు ఎగవేయడంతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేయగా 2015మార్చిలో సీబీఐ కేసు నమోదు చేసింది.
శామీర్పేట మండలం బొమ్మరాసిపేటలో సుమారు 65ఎకరాల స్థలంలో ఈ రిసార్ట్స్ నిర్మాణం కోసం చక్రవర్తిరాజు అక్రమాలకు పాల్పడినట్లు బ్యాంకు అధికారులు పత్రాలు సమర్పించారు. హెచ్ఎండీఏ 13అంతస్తులకు మాత్రమే అనుమతి ఇవ్వగా... 18అంతస్తులు నిర్మించారని ఫిర్యాదులో తెలిపారు.
రైతులకు సంబంధించిన ప్లాట్లకు తప్పుడు జీపీఏలు సృష్టించడమే కాకుండా వాటిని 11బ్యాంకుల్లో తనఖాపెట్టి సుమారు రూ. వందల కోట్ల రుణాలు పొందారని వెల్లడించారు. అంతేగాక, బ్యాంకు రుణాల కోసం ఒక సర్వే నంబరు స్థలాన్ని చూపి మరో సర్వే నంబరులో రిసార్ట్స్ నిర్మాణం చేపట్టారని హెచ్ఎండీఏ ప్లాన్లను సైతం సమర్పించారు.
దీంతో అప్పట్లోనే సీబీఐ అధికారులు రిసార్ట్స్లో తనిఖీలు చేసి విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా సాక్ష్యాధారాలు సేకరించి బుధవారం నిందితున్ని అరెస్ట్చేసి రిమాండ్కు తరలించారు. మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు చక్రవర్తి రాజును కస్టడీకి తీసుకుని విచారిస్తామని సీబీఐ అధికారులు చెప్పారు.