ఏం చేస్తున్నారో!: ఓ ఇంట్లోకి తొంగిచూసిన చిరుతపులి, జనం బెంబేలు
హైదరాబాద్: నగర శివారులోని రాజేంద్రనగర్లో చిరుత మరోసారి కలకలం రేపింది. రాజేంద్రనగర్ సమీపంలోని జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ పరిసరాల్లో సంచరించింది. నారం ఫాంహౌస్లోని ఓ ఇంటి వద్ద కాంపౌండ్లోకి వెళ్లినట్లు గుర్తించారు. సీసీ టీవీ ఫుటేజీలో చిరుతను చూసి స్థానికులు షాక్ తిన్నారు.
Recommended Video
కిటికీ ఎక్కి తొంగిచూసిన చిరుత..
కిటికీ ఎక్కి ఓ ఇంట్లోకి తొంగి చూస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. దీంతో భయాందోళనలకు గురైన స్థానికులు.. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుత సంచారంపై మరోసారి ఫిర్యాదు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. దాని కోట గాలింపు ముమ్మరం చేశారు.
నడిరోడ్డుపై చిరుత కలకలం..
ప్రస్తుతం ఆ చిరుత పులి జాడ కనుగొనే పనిలో ఉన్నారు. కాగా, మే 14న కాటేదాన్ ప్రాంతంలో చిరుత పులి నడిరోడ్డుపై కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. నడిరోడ్డుపై డివైడర్ దగ్గర పడుకుని హల్చల్ చేసింది. ఆ తర్వాత స్థానికులు అరుపులు కేకలు వేయడంతో పరుగులు తీసింది.
సీసీటీవీ ఫుటేజీలో బిగ్ క్యాట్..
ఆ తర్వాత ఓ లారీ డ్రైవర్ పై దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే, అతడు తృటిలో దాన్నుంచి తప్పించుకున్నాడు. అనంతరం సమీపంలో ఉన్న ఫాంహౌస్ వైపు వెళ్లింది. వెంటనే అటవీ అధికారులు రంగంలోకి దిగి పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే అది అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు మరోసారి చిరుత కదలికలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడం, రోడ్లపై వాహనాలు తిరగకపోవడంతో అనేక ప్రాంతాల్లో జంతువులు రోడ్లపైకి వచ్చిన విషయం తెలిసిందే. అంతేగాక, వేసవి కాలంలో అడవుల్లో నీరు, ఆహారం దొరక్కపోవడంతో జంతువులు నగరాల్లోకి. జనావాసాల్లోకి వస్తున్నాయి.