లిబియా కిడ్నాప్లు: నలుగురిలో ఇద్దరినే ఎందుకు విడుదల చేశారు?
హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్ధ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) వద్ద బందీలుగా ఉన్న ఇద్దరు తెలుగువారి పరిస్ధితిపై ఎలాంటి సమాచారం లేదు. లిబియాలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న ఏపీలోని శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన గోపీకృష్ణ, తెలంగాణలో హైదరాబాద్కు చెందిన బలరాంలతో పాటు కర్ణాటకకు చెందిన మరో ఇద్దరిని బంధించిన ఐదు రోజుల క్రితం బంధించిన సంగతి తెలిసిందే.
అయితే వారిలో కర్ణాటకకు చెందిన ఇద్దరిని విడిచిపెట్టినా, గోపికృష్ణ, బలరాం ఇంకా ఉగ్రవాదుల చెరలోనే ఉన్నట్లు సమాచారం. బాధితుల కుటుంబ సభ్యులు తమ వారిని విడిపించేందుకు కృషి చేయాల్సిందిగా అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.
భారత్కు చెందిన నలుగురిని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు ఇద్దరిని వదిలిపెట్టి మరో ఇద్దరిని తమ వద్ద బందీలుగు ఎందుకు ఉంచుకున్నారో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అయితే తెలుగు వారిద్దరిని విడిచిపెట్టారా లేదా అనే విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. తెలుగువారిద్దరూ కిడ్నాపర్ల చెరలోనే ఉన్నారా? సురక్షితంగా బయటపడ్డారా అనే అంశంపై గందరగోశం నెలకొంది.
విడుదలైన కర్ణాటక ప్రొఫెసర్ విజయ్ కుమార్ ఏమన్నారు?
నలుగురు భారతీయులను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు హైదరాబాద్కు చెందిన తెలుగు వారిద్దరిని వేరే రూమ్లో ఉంచినట్లు విడుదలైన కర్ణాటక ప్రొఫెసర్ విజయ్ కుమార్(56) తెలిపారు. అంతేకాదు తమకు టీచర్లంటే గౌరవమని కూడా చెప్పారట. కిడ్నాప్కు గురైన తర్వాత ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నామని ఉగ్రవాదుల చెర నుంచి విడుదలైన విజయ్ కుమార్ చెప్పారు.
తమను చీకటి గదిలో బంధించారని తెలిపారు. కిడ్నాపర్లు తమ పేర్లు, మతం, ఉద్యోగాల గురించి అడిగారని చెప్పారు. తాము యూనివర్సిటీలో అధ్యాపకులుగా పనిచేస్తున్నామని చెప్పగానే తమ పట్ల వారి వైఖరిలో సానుకూల మార్పు కనబడిందని వివరించారు.
కిడ్నాపర్ల నాయకుడు తన పేరు షేక్గా పరిచయం చేస్తున్నాడని తెలిపారు. ఎవరికో ఫోన్ చేసి అరబిక్ మాట్లాడారని, తర్వాత అతడి వైఖరితో మార్పు వచ్చిందన్నారు. 'టీచర్లు అంటే మాకెంతో గౌరవం. మీ కారణంగానే లిబియాలో ఎంతోమంది పిల్లలు చదువుకుంటున్నారు. మీకు ఎటువంటి హాని తలపెట్టం' అని షేక్ తమతో చెప్పాడని వెల్లడించారు.
తెలుగువారి విడుదలకు సెక్యూరిటీ కారణాలే ఆలస్యం..!
లిబియాలో ఉగ్రవాదులు చేస్తున్న పోరాటం విజృంభించింది. ఈ పోరాటం మరింతగా ఉగ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యమే బందీలుగా ఉన్న తెలుగు వారిద్దరూ విడుదలకు ఆలస్యమవుతుందని సమాచారం.
ఉగ్రవాదలు చెర నుంచి తెలుగువారి విడుదల కోసం లిబియా అధికారులతో భారతీయ విదేశాంగ శాఖ సంప్రదింపులు జరుపుతూనే ఉంది. అయితే తెలుగువారి విడుదలకు కారణం లిబియాలో నెలకొన్న పరిస్ధితులే అడ్డంకిగా మారాయని అంటున్నారు.
ఆదివారం కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ బాధితుల కుటుంబాలను కలిసి ఇదే విషయాన్ని వారికి వివరించారు. టీఆర్ఎస్కు చెందిన ఎంపీ జి.వినోద్ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ను కలిసి ఢిల్లీలో మాట్లాడారు. బాధితులను రక్షించే ప్రయత్నాలు వేగవంతం చేయాలని కోరారు.