కేబిఆర్ పార్క్లో నిత్యానందపై ఫైరింగ్: ఓబులేష్కు జీవిత ఖైదు, ఏం జరిగింది?
హైదరాబాద్: గత ఏడాది నవంబర్ నెల 19వ తేదీన కేబిఆర్ పార్క్ వద్ద నిత్యానంద రెడ్డి పైన కాల్పులు జరిపిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఓబులేష్కు నాంపల్లి న్యాయస్థానం గురువారం నాడు.. జీవిత ఖైదు విధిస్తూ శిక్షను విధించింది.
నిత్యానంద రెడ్డిని కిడ్నాప్ చేసే క్రమంలో ఓబులేష్ కాల్పులు జరిపాడు. దీని పైన కోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో అతనికి జీవిత ఖైదు విధించింది.
ఇదీ జరిగింది, ఎవరీ ఓబులేష్
నవంబర్ 19, 2014న... బుధవారం ఉదయం అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానంద రెడ్డి పైన కాల్పులు జరిగాయి. ఆయన మార్నింగ్ వాక్కు వచ్చినప్పుడు ఇది జరిగింది. కారు ఎక్కుతుండగా కానిస్టేబుల్ ఓబులేష్ కాల్పులు జరిపాడు.
నాడు కాల్పుల ఘటన కేసును పోలీసులు ఒక్కరోజులోనే చేధించారు. కాల్పులు జరిపింది ఏఆర్ కానిస్టేబుల్ ఓబులేష్గా తేల్చారు. అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఓబులేష్తో పాటు ఇతరుల పాత్ర ఉన్నట్లు గుర్తించారు.
ఓబులేష్ గత మార్చి నుండి అంబర్ పేట పీఎస్లో పని చేస్తున్నాడు. ఓబులేష్ మరో ముగ్గురితో కలిసి స్కెచ్ వేశాడు. నిత్యానంద రెడ్డిని కిడ్నాప్ చేసి వారి కుటుంబ సభ్యుల నుండి భారీగా డబ్బులు తీసుకుందామని భావించాడు. ఓబులేష్ను గుత్తిలో అరెస్టు చేశారు. సుంకులమ్మ ఆలయ సమీపంలో అతను పట్టుబడ్డాడు.
ఓబులేష్ కడప జిల్లాకు చెందిన వ్యక్తి. అంతకుముందు కర్నూలులో పని చేశాడు. గ్రేహౌండ్స్లో పని చేశాడు. వైజాగ్ నుండి హైదరాబాద్ వస్తుండగా ఆయుధం అదృశ్యమైంది. అతనే తనకు తెలిసిన వారికి ఆయుధం ఇచ్చినట్లుగా తెలిసింది.
బుధవారం ఉదయం ఏడున్నర గంటలకు బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ వద్ద పార్కింగ్ వద్ద కారులోకి ఎక్కిన నిత్యానంద రెడ్డితో పాటు ఓబులేష్ ఎక్కి అతనిని బెదిరించాడు. ఈ సమయంలో పెనుగాలట, కాల్పులు జరిగాయి. నిత్యానంద సోదరుడు నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేయడంతో అతను పారిపోయాడు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేసి, కేసును చేధించారు. ఘటన ప్రాంతంలోనే ఆధారాలు దుండగుడు చాలా ఆధారాలను కారులోనే వదిలేశాడు. అవి తాను కిడ్నాప్ కోసం వాడిన ఏకే 47 రైఫిల్, కొత్తగా కొనుకున్న ఒక కొత్త జీన్స్ ప్యాంట్, దాని తాలూకు బిల్లు, వీటితో పోలీసుల పని సులువయింది.
బట్టల షోరూంలో.. బిల్లును పట్టుకుని కొత్త జీన్స్ ప్యాంటుతో సహా పోలీసులు చందనా బ్రదర్స్కు చేరుకున్నారు. జీన్స్ ప్యాంట్పై ఉన్న బార్కోడ్ ట్యాగ్ ఆధారంగా ఆ ప్యాంట్ను ఏ సమయంలో కొన్నారో తెలుసుకున్నారు. ఆ సమయానికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ స్వాధీనం చేసుకున్నారు.
ఆ దృశ్యాలను నిత్యానంద్కు చూపించారు. దుండగుడెవరో తెలిసిపోయింది. కాల్పుల సమయంలో... నిత్యానంద రెడ్డి కారు ఆపిన చోటుకు అతను 20 అడుగుల దూరంలోనే అతను బైఠాయించాడు. తెలుపు రంగు చొక్కా, ఎరుపు రంగు ట్రాక్ ప్యాంట్ ధరించాడు. ఏకే-47 బయటికి కనిపించకుండా లుంగీలో చుట్టి సంచిలో పెట్టేశాడు.