రూ.1.33 కోట్ల దోపిడీలో ట్విస్ట్, తెరపైకి స్నేహితుడు: షాకింగ్ నిజాలు
హైదరాబాద్: బుధవారం నాడు పూజల పేరుతో పరమాన్నం పెట్టి, లైఫ్ స్టైల్ భవనం యజమాని మధుసూదన రెడ్డిని మోసం చేసిన దొంగ స్వామీజీ కేసులో కొత్త ట్విస్ట్. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. బురిడీ బాబా కారు వర్ను పోలీసులు అరెస్టు చేశారు.
ప్రసాదం పెట్టి, రూ.1.33 కోట్లు కొట్టేశాడు: లైఫ్స్టైల్ ఓనర్కు నకిలీ బాబా టోకరా
అతని నుంచి పోలీసులు ఏం జరిగిందనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. అతను ఎన్నో షాకింగ్ విషయాలను పోలీసులకు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. బెంగళూరు నుంచి వచ్చిన దొంగ స్వామీజీ.. ప్రముఖ వ్యాపారవేత్త, లైఫ్ స్టైల్ యజమాని మధూసూదన్ రెడ్డి నుంచి రూ.1.33 కోట్లు కొట్టేసిన విషయం తెలిసిందే.
విచారణలో డ్రైవర్ పలు విషయాలను చెబుతున్నాడు. అసలు ఏం జరిగిందో, ఎలా జరిగిందో ఆయన వివరించాడని తెలుస్తోంది.
లైఫ్ స్టైల్ యజమాని మధుసూదన్ రెడ్డికి చిందల్కు చెందిన మోహన్ రెడ్డి స్నేహితుడు. వాస్తు దోషం, ఆర్థిక ఇబ్బందుల కోసం బాబాతో పూజలు చేయించాలని మధుసూదన్ రెడ్డి పైన మోహన్ రెడ్డి ఒత్తిడి తెచ్చాడు. ఆయన అంగీకరించాక.. శివబాబాతో పూజలు చేయించాలని చెప్పాడు.
దీంతో, బెంగళూరు నుంచి మోహన్ రెడ్డి ఓ దొంగ బాబాను రప్పించాడు. ఆ దొంగ బాబు కోసం ఓ హోటల్లో రూం బుక్ చేశారు. పూజల కోసం బేగంబజారులో పూజా సామాను, పూలు కొనుగోలు చేశారు. మధుసూదన్ రెడ్డి, దొంగ బాబా వెళ్లి పూలు కొన్నారు.
ఆ తర్వాత పూజల పేరుతో వారిని మభ్య పెట్టాడు. పూజ అనంతరం.. నగదు, బంగారు ఆభరణాలను మూట కట్టించాడు. ఆ మూటను గుడిలో పెట్టాలని వారికి సూచించాడు. ఈ సమయంలో దొంగ బాబు నగలు, డబ్బు ముఠాతో ఇన్నోవా కారులో బయలుదేరాడు.
వారితో మధుసూదన్ రెడ్డి తనయుడు సందేశ్ కూడా బయలుదేరాడు. అయితే, సందేశ్ను ముందు కారులో వెళ్లమని చెప్పిన దొంగ బాబా, మీ వెనుక వస్తానని చెప్పాడు. సందేశ్ ముందు కారులో వెళ్లాడు. కొద్ది దూరం వెళ్లాక వెనుకాల దొంగ బాబా కారు కనిపించలేదు.
మరోవైపు, సందేశ్ను ముందు పంపించిన దొంగ బాబా మరో కారులో బయలుదేరాడు. ఇన్నోవా కారులో బయలుదేరిన దొంగ బాబు మరో కారులో హోటల్కు చేరుకొని, అక్కడి నుంచి పరారయ్యాడు. అప్పటికే, ప్రసాదంగా ఇచ్చిన పరమాన్నం తిని మధుసూదన్ రెడ్డి, ఆయన సతీమణి సొమ్మసిల్లారు. కొడుకు సందేశ్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్నేహితుడు మోహన్ రెడ్డి కూడా పరారీలో ఉన్నాడు.
పరామర్శించిన గుత్తా సుఖేందర్ రెడ్డి
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మధుసూదన్ రెడ్డిని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కలిశారు. ఆయనను పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మధుసూదన్ రెడ్డి కోలుకుంటున్నారని, సాయంత్రానికి డిశ్చార్జ్ అవుతారని గుత్తా చెప్పారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందన్నారు. ఏం జరిగిందని విలేకరులు అడగగా... ఇలాంటి పరిస్థితుల్లో అడగడం బాగుండదని అందుకే అడగలేదన్నారు.