తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు
హైదరాబాద్ : మండుటెండలతో అల్లాడుతున్న జనానికి వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణలో మూడు రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అయితే వర్షాలు లేని ప్రాంతాల్లో మాత్రం వడగాలుల ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఫొని తుఫాను ప్రభావం తెలంగాణపై అంతగా ఉండదని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అయితే మంగళవారం నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం దొరుకుతుందని అన్నారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే సూచనలు ఉన్నట్లు ఐఎండీ ప్రకటించింది.
బంగాళాఖాతంలో బలపడుతున్న ఫణి తుఫాను...ఈ ప్రాంతాలకు పొంచి ఉన్న ముప్పు
నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, సిద్ధిపేట, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పొడి వాతావరణం ఉంటుందని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లో వడగాల్పులు వేచే అవకాశమున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.