ఊరట: క్యాష్ విత్ డ్రాపై పరిమితి ఎత్తివేత, కానీ..
నోట్ల రద్దు అనంతరం అంచెలంచెలుగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ పైన అమలును ఎత్తివేస్తోంది.
ముంబై: నోట్ల రద్దు అనంతరం అంచెలంచెలుగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ పైన అమలును ఎత్తివేస్తోంది. తాజాగా, సోమవారం నాడు మరో ప్రకటన చేసింది. సామాన్యుడికి ఊరటనిచ్చే ప్రకటన చేసింది.
ఎల్లుండి.. అంటే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నగదు ఉపసంహరణ పైన పరిమితిని ఎత్తివేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అయితే, సేవింగ్స్ ఖాతాకు సంబంధించి మాత్రం వారానికి రూ.24వేల నగదు పరిమితిని కొనసాగించాలని నిర్ణయించింది.
కాగా, రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ గత ఏడాది నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కొత్త నోట్లు చలామణిలోకి వచ్చే వరకు అన్ని బ్యాంకు ఖాతాలు, ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణపై పరిమితులు విధించారు.
చెక్ ద్వారా వారానికి రూ.24వేలు, ఏటీఎంల నుంచి రూ.2వేలు మాత్రమే తీసుకునేలా నిబంధన విధించారు. ఆ కొత్త నోట్ల చలామణి నెమ్మదిగా పెరగడంతో ఏటీఎంలలో నగదు ఉపసంహరణ పరిమితిని రూ.4500కు పెంచారు. ఇటీవల ఆ మొత్తాన్ని రూ.10వేలకు పెంచారు.