తెలంగాణ కొత్త లిక్కర్ పాలసీ.. నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజు డబుల్
హైదరాబాద్ : కొత్త లిక్కర్ పాలసీ విధానం ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఆ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నూతన మద్యం పాలసీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. 2019, నవంబర్ 1నుంచి 2021, అక్టోబర్ 31 వరకు కొత్త మద్యం విధానం అమల్లో ఉండనుంది. జనాభా ప్రాతిపదికన ఈసారి లైసెన్స్ ఫీజులను ఖరారు చేసింది సర్కార్. ఇదివరకు ఉన్న 4 స్లాబులను 6 స్లాబులుగా మార్చడం గమనార్హం. ఇక నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజును ఇదివరకటి కంటే డబుల్ చేయడం చర్చానీయాంశమైంది.
కొత్త లిక్కర్ పాలసీ.. నాన్ రిఫండబుల్ ఫీజు డబుల్
లిక్కర్ దుకాణాల కోసం ఇదివరకు ఉన్న లక్ష రూపాయల నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజును ఈసారి డబుల్ చేసింది ప్రభుత్వం. దాంతో అది కాస్తా రెండు లక్షల రూపాయలకు చేరింది. లక్ష రూపాయలంటే ఇదివరకు చాలామంది తమ అదృష్టం పరీక్షించుకోవడానికి ముందుకొచ్చారు. ఈసారి రెండు లక్షల రూపాయలను ఫీజుగా నిర్ణయించడంతో కొందరు వెనుకడుగు వేస్తారనే టాక్ వినిపిస్తోంది. అయితే ప్రభుత్వ ఖజానా నిండేందుకే ఇలా దరఖాస్తు ఫీజును రెండింతలు చేశారనే వాదనలు లేకపోలేదు.
ఖాకీల ప్రవర్తన సరిగా లేదు.. జైళ్లల్లో పేదలే.. పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్ హాట్ కామెంట్స్..!
2,216 లిక్కర్ షాపులకు లాటరీ.. తెరిచి ఉంచే సమయాలు ఇవే
రాష్ట్రవ్యాప్తంగా ఈసారి 2 వేల 216 మద్యం దుకాణాలను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయనున్నారు. అదలావుంటే మద్యం దుకాణాలు ఏయే సమయాల్లో తెరిచి ఉంచాలనే విషయం కూడా ప్రభుత్వం ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు లిక్కర్ దుకాణాలు తెరిచి ఉంచవచ్చు.
ఇతర ప్రాంతాల్లో మాత్రం ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మద్యం దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చారు. ఈనెల ఆఖరి లోగా లాటరీ విధానం ద్వారా మద్యం లైసెన్సుదారుల ఎంపిక జరగనుంది. వచ్చే నెల 1 వ తేదీ నుంచి కొత్తగా ఎంపికయిన మద్యం లైసెన్సుదారుల విధానం అమలు కానుంది.
లైసెన్స్ ఫీజులు ఎంతంటే..!
5 వేల మంది లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజును 50 లక్షల రూపాయలుగా నిర్దేశించింది ప్రభుత్వం. ఇక 5 వేల నుంచి 50 వేల లోపు జనాభా ఉన్న ఏరియాల్లో లైసెన్స్ ఫీజును 55 లక్షల రూపాయలుగా నిర్ణయించింది. అదే క్రమంలో 50 వేల నుంచి లక్ష మంది వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజును 60 లక్షల రూపాయలుగా ప్రకటించింది.
లక్ష జనాభా నుంచి 50 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు లైసెన్స్ ఫీజు 65 లక్షల రూపాయలు కాగా.. 5 లక్షల నుంచి 20 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు 85 లక్షల రూపాయలుగా నిర్ణయించింది. ఇక 20 లక్షల మందికి పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో కోటి 10 లక్షల రూపాయలను లైసెన్స్ ఫీజుగా నిర్దేశించింది సర్కార్.