మందుబాబులకు బాడ్న్యూస్: 20 శాతం వరకు పెరగనున్న మందు ధర..? రేపట్నుంచి కొత్త మద్యం పాలసీ..
తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. నవంబర్ 1 నుంచి 2021 అక్టోబర్ వరకు నూతన మద్యం పాలసీ అమల్లో ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఈసారి మద్యం ధరలు పెరుగుతాయని ఆబ్కారీ శాఖ సంకేతాలు ఇచ్చింది. ఇటీవల ఏపీలో కూడా మద్యం ధరలు పెంచిన సంగతి తెలిసిందే. పొరుగురాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని మద్యం ధర పెంచాలని భావిస్తున్నట్టు సమాచారం.
20 శాతం పెంపు..?
ఏపీలో ఇటీవల కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. మద్యంపై 15 నుంచి 20 శాతం ధరలను పెంచిన సంగతి తెలిసిందే. ఏపీలో మాదిరిగా తెలంగాణలో కూడా మద్యం ధరలు పెంచాలని ఆబ్కారీ శాఖ భావిస్తోంది. 20 శాతం వరకు ధర పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కానీ దీనిని ఆబ్కారీ శాఖ అధికారులు ధ్రువీకరించలేదు.
తొలుత రాని స్పందన
కొత్త మద్యం పాలసీ ప్రకటించి నోటిఫికేషన్ విడుదల చేయడంతో తొలుత వ్యాపారుల నుంచి ఆశించిన మేర స్పందన రాలేదు. తర్వాత మాత్రం ఏపీ సరిహద్దుకు చెందిన వ్యాపారులు జోరుగా దాఖలు చేశారు. మరోవైపు లైసెన్స్ ఫీజును కూడా ఆబ్కారీ శాఖ పెంచింది. ఇదివరకు రూ.లక్ష ఉన్న ఫీజును రూ.2 లక్షలు చేసిన సంగతి తెలిసిందే.
ఆరు స్లాబుల్లో..
ఇదివరకు ఉన్న నాలుగు స్లాబులను కూడా ఆరుగా చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో మద్యం షాపులో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వైన్స్ షాపు తెరచి ఉంటాయని పేర్కొన్నది. ఇతర ప్రాంతాల్లో రాత్రి 10 గంటలకే మూసివేస్తారని స్పష్టంచేసింది. డిసెండర్ 31 సమయంలో మాత్రం గడువును ప్రతీ ఏటా పొడిగిస్తున్న సంగతి తెలిసిందే. బార్లు, పబ్లతోపాటు వైన్స్ సమయం కూడా పెంచుతారు.
కలవరం..
కొత్త మద్యం పాలసీ పేరుతో ధరలు పెంచుతారనే వార్తలు మందుబాబులను కలవరానికి గురిచేస్తోంది. ధరల పెంపు ఊహాగానాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ప్రతీసారి మందు ధర పెంచుతారా అంటూ వాపోతున్నారు. మరోవైపు వ్యాపారులు మాత్రం తమ ఫీజును మాత్రం డబుల్ చేశారని వాపోయారు. వారు మద్యం ధరల పెంపుపై మాత్రం స్పందించలేదు.