కేసీఆర్ ఫాలోస్ జగన్: మద్యం పాలసీలో అదే బెటర్..తెలంగాణలోనూ ఇక కిక్కే కిక్కు..!
హైదరాబాదు : తెలంగాణలో మద్యం అమ్మకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటి వరకు పొరుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు ప్రారంభం కావడంతో రాష్ట్రంలోనూ మద్యం పాలసీపైన ప్రభుత్వం తర్జన భర్జన పడింది. కరోనా కారణంగా నష్టపోయిన రెవిన్యూ లోటును భర్తీ చేసుకునేందుకు అదే సమయంలో రేట్లు పెంచడం ద్వారా పేదలకు మద్యం అందకుండా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. రెడ్ జోన్లు మినహాయించి మిగిలిన చోట్ల మద్యం అమ్మకాలను ప్రారంభించాలని డిసైడ్ అయినట్లు విశ్వసనీయ సమాచారం.
Recommended Video
దీంతో పాటుగా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో హైదరాబాదుతో సహా పొరుగు జిల్లాల్లో లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేస్తూ ఈ నెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న మంత్రివర్గ సమావేశం అనంతరం దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
జగన్ బాటలో కేసీఆర్
కేంద్ర అనుమతితో పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ కొనసాగుతుండగానే మద్యం అమ్మకాలు సైతం మొదలయ్యాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం సోమ మంగళవారంలో మద్యం అమ్మకాలు ప్రారంభించలేదు. సరిహద్దు రాష్ట్రాల్లో అమ్మకాలు ప్రారంభించినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇతర రాష్ట్రాల్లో పరిస్థితిని అధ్యయనం చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని భావించింది. ఇదే సమయంలో లాక్డౌన్ కారణంగా ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోయింది.
అయినా ఆదాయం కంటే ఆరోగ్యమే ప్రధానమని చెబుతూ ప్రభుత్వం మద్యం దుకాణాలకు మాత్రం లాక్ ఓపెన్ చేయలేదు. కానీ కేంద్ర ప్రభుత్వమే అనుమతి ఇవ్వడం, పలు రాష్ట్రాలు ఇప్పటికే అమ్మకాలు ప్రారంభించడంతో తెలంగాణ సైతం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పాటుగా పొరుగు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్యం అమ్మకాల విషయంలో అనుసరిస్తున్న విధానాన్నే తాము అనుసరించే విధంగా తెలంగాణ ప్రభుత్వంలో తర్జన భర్జన సాగుతోంది.
మద్యం అమ్మకాలపై కరోనా సెస్
ఏపీలో మద్యం అమ్మకాలను ప్రారంభిస్తూనే లాక్డౌన్ సమయంలో తొలిరోజు 25 శాతం ధరలు పెంచి మద్యంను విక్రయించారు. భారీ సంఖ్యలో మందుబాబులు లాక్డౌన్ నిబంధనలను సైతం తుంగలో తొక్కి కిలోమీటర్ల మేరా క్యూలైన్లలో నిలబడి మరీ మద్యం కొనుగోలు చేశారు. ఏపీలో ఒక్కరోజు మద్యం అమ్మకాల ద్వారా దాదాపు 60 కోట్ల ఆదాయం సమకూరింది. దీంతో మందుబాబుల నాడిని అర్థం చేసుకున్న ఏపీ ప్రభుత్వ పెద్దలు ఉకంగా మరో 50శాతం మేరా మద్యం ధరలు పెంచేశారు. అయినా డిమాండ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.
ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సైతం జగన్ ఫిలాసఫీని అనుసరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మద్యం ధరలను పెంచి బుధవారం నుంచి రెడ్ జోన్ మినహా మిగిలిన ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు మద్యం విక్రయాలు మొదలు పెట్టాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఢిల్లీ ప్రభుత్వం తరహాలోనే పెంచిన ధరలకు కోవిడ్ సెస్గా చెప్పుకుంటూ ఆదాయాన్ని పెంచుకోవడం అదే సమయంలో ధరలు పెంపు ద్వారా మద్యంకు బానిసలైన పేదలకు అందుబాటులో లేకుండా చేయడం ప్రభుత్వ విధానంగా కనిపిస్తోంది. దీనిపై ఈ రాత్రికి పూర్తి స్పష్టత రానుంది.