ఇక బీర్ల స్థానంలో లిక్కర్..! బీర్ బాబులను బేర్ మనిపిస్తున్న అబ్కారి నిర్ణయం..!
హైదరాబాద్ : ఇది ఖచ్చితంగా బీరు ప్రియులకు చేదు వార్తే..! వేసవి తాపం పెరుగుతోంది. సాయంత్రానికి జిహ్వ చాపల్యం ఉన్న మందు బాబులు కాస్త బీరుతో గొంతు తడుపుకోవచ్చనుకుంటే అది ఇక కుదరని పని. బీరు తాగకండి. కావాలంటే మద్యం తాగండి అంటూ హుకుం జారీ చేస్తోంది రాష్ట్ర ఎక్సైజ్ శాఖ. ఇది వినడానికి వింతగానే ఉన్నా అదే పోకడను ప్రదర్శిస్తోంది. నిజానికి దేశంలోనే బీరు ఎక్కువ వినియోగంలో ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఇక్కడి మందుబాబులు బీరే ఎక్కువ ఇష్టపడతారు. ఎండాకాలంలో బీరు విక్రయాలు మరింత జోరుగా ఉంటాయి. కానీ ఎక్సైజ్ శాఖ కేవలం అదనపు ఆదాయం కోసం కక్కుర్తి పడుతూ బీరు విక్రయాలను తగ్గిస్తూ మద్యం అమ్మకాలను పెంచాలని యోచిస్తోంది.
డిపోల నుంచి బీరు ఇవ్వొద్దంటూ ఎక్సైజ్ ఆదేశాలు..! యజమానుల ఆందోళన..!!
ఎక్పైజ్ శాఖ తీసుకున్న ఈ నిర్ణయంలో మతలబు లేకపోలేదని తెలుస్తోంది. బీరుపై ఎక్సైజ్ డ్యూటీ తక్కువగా ఉండగా, మద్యంపై ఎక్కువగా ఉంది. అందుకే మద్యాన్ని విక్రయిస్తే ఖజానాకు ఎక్కువ కాసులు రాలుతాయన్నది ఆ శాఖ ఉద్దేశం. కానీ ఎక్సైజ్ శాఖ వింత పోకడతో వైన్ షాపులు, బార్ల యజమానులు ఆందోళనకు గురవుతున్నారు. లైసెన్సు ఫీజు రూపంలో లక్షలాది రూపాయలు చెల్లిస్తుంటే తమపై అసమంజసమైన నిబంధనలు పెడుతూ నష్టాలకు కారణమవుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. బుధవారం ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల నుంచి అన్ని మద్యం డిపోలకు మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. వైన్ షాపులు, బార్లు, క్లబ్బులవారికి బీరు విక్రయించరాదని, కేవలం మద్యం మాత్రమే సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసారు అదికారులు.
మద్యం కేసులు మాత్రమే విక్రయించాలి..! 6వ తారీఖు నుంచి సరఫరా బంద్..!!
దాంతో రాష్ట్రంలోని 19 డిపోల మేనేజర్లు బుధవారం ఎవరికీ బీరును సరఫరా చేయలేదు. కేవలం మద్యంను లిఫ్ట్ చేయాలనుకున్న వారికి మాత్రమే సరఫరా చేశారు. ఒక్క బీరు సీసా కూడా డిపోల నుంచి బయటకు రాలేదు. అదేమని అడిగితే ఉన్నతాధికారుల ఆదేశాలంటూ డిపో మేనేజర్లు సమాధానమిచ్చారని వైన్ షాపుల యజమానులు చెప్పారు. అంతేకాదు గురువారం కూడా బీరు సరఫరా చేయబోమని డిపో మేనేజర్లు చెప్పేశారు. కాకపోతే ఒక వెసులుబాటు ఇచ్చారు. గురువారం డిపోల నుంచి బీరును లిఫ్ట్ చేయాలంటే.. 75శాతం మద్యం, 25శాతం బీరును తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. దాంతో యజమానులు లబోదిబో మంటున్నారు.
అప్రకటిత సెలవులు..! ఆందోళన వ్యక్తం చేస్తున్న యజమానలు..!!
గురువారం ఒక్క రోజు అంత తక్కువ బీరును తీసుకుంటే షాపులను ఎలా నడపాలని వారు వాపోతున్నారు. మరో విచిత్రమేమిటంటే ఎక్సైజ్ శాఖ తన మద్యం డిపోలకు మార్చి 1, 2, 3, 4 రోజుల్లో వరుస సెలవులను ప్రకటించింది. 1న, 2న శుక్ర, శనివారాలు. ఎలాంటి పండుగలు, డ్రైడేలు లేనప్పటికీ మద్యం సరఫరా చేయరాదంటూ డిపోలను ఆదేశించింది. 3న ఆదివారం, 4న మహాశివరాత్రి కావడంతో సాధారణంగా సెలవు దినాలుగా యజమానులు అంగీకరిస్తున్నారు. కానీ 1, 2 తేదీల్లో ఎందుకు సెలవులుగా పాటించాలంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ నాలుగు రోజుల పాటు డిపోలకు సెలవులు కావడంతో గురువారం ఒక్కరోజే మద్యంను లిఫ్ట్ చేయడానికి అవకాశముందని చెప్పారు.
బీరు ప్రియులకు ఇబ్బందే..! గొంతు తడుపుకోవడం కష్టమే..!
కానీ ఆరోజు 25 శాతం బీరు, 75శాతం మద్యం సరఫరా చేస్తామని చెబుతుండడంతో తమకు ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. బుధవారం మొత్తానికే బీరు సరఫరా చేయలేదని, గురువారం 25శాతం బీరుతో ఎలా సరిపెట్టుకుంటామని అంటున్నారు. ఒకపక్క వేసవి తాపంతో బీరు విక్రయాలు పెరిగాయని, ఇలాంటి సందర్భంలో విక్రయాలు పెంచుకోవాలని ఆలోచించాలి గానీ తగ్గించుకోవాలంటూ ఆదేశించడం ఇదెక్కడి వింత ధోరణి అంటూ యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.