ఓ పార్టీ పత్రికపై వెంకయ్య అసహనం, తెలంగాణతో మాట్లాడుతా
హైదరాబాద్: తన వ్యాఖ్యలను ఓ పార్టీకి చెందిన పత్రిక వక్రీకరిస్తోందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం అసహనం వ్యక్తం చేశారు. ఆయన పరోక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అన్నట్లుగా భావిస్తున్నారు.
హైదరాబాదులో తెలంగాణ ప్రాంతానికి చెంది భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులతో వెంకయ్య ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు తెలంగాణ ప్రభుత్వం తమకు అభివృద్ధి విషయంలో సహకరించడం లేదని ఫిర్యాదు చేశారు.
వెంకయ్య మాట్లాడుతూ.. తాను తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడుతానని చెప్పారు. తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఎన్నిక కాకపోయినా తెలుగు వ్యక్తిగా రెండు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు అందర్నీ కలుపుకొని వెళ్లాలన్నారు.
హైదరాబాద్, వరంగల్ నగరాలను స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేశామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో పదకొండు నగరాలు అమృతి పథకంలో ఎంపిక చేస్తున్నామని, స్వచ్ఛ భారత్ పథకంలో భాగంగా తెలంగాణకు రూ.403 కోట్ల నిధులు విడుదల చేసినట్లు చెప్పారు.
స్మార్ట్ సిటీల ఎంపిక పూర్తయిందని, అక్టోబర్ 1వ తేదీన అధికారికంగా ప్రకటన చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా అమృత్ పథకం కింద 500 నగరాలను ఎంపిక చేశామన్నారు. ఎంపికైన ఒక్కో నగరానికి రూ.200 కోట్లు కేటాయిస్తామన్నారు.
తెలంగాణలో అమృత్ పథకానికి హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం, మహబూబ్ నగర్, నల్గొండ, అదిలాబాద్, సూర్యాపేట, మిర్యాలగూడలను ఎంపిక చేసినట్లు చెప్పారు. మెదక్ జిల్లాలోని సిద్దిపేట పరిశీలనలో ఉన్నట్లు చెప్పారు.
కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమన్నారు. టీమిండియాలా పని చేయాలన్నదే తమ ఉద్దేశ్యమని చెప్పారు. రాజీవ్ ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణం ఆగిపోయిన ఇళ్లను పూర్తి చేస్తామని చెప్పారు.