పసిమొగ్గలను పాపకూపంలోకి నెడుతున్న పాపిస్టి యెదవలు..! పట్టుకున్న పోలీసులు..!!
ధర్మపురి/హైదరాబాద్ : అభం శుభం తెలియని చిన్నారులను పాపపు కూపాల్లోకి నెడుతున్నారు కేటుగాళ్లు. అడ్డదారుల్లో అక్రమ సంపాదనకు మరిగిన కొంతమంది లోఫర్ యెదవల వల్ల ముక్కుపచ్చలారని చిన్నారులు బలైపోతున్నారు. ఐదుగురు బాలికలను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపే యత్నాన్ని జగిత్యాల జిల్లా ధర్మపురి పోలీసులు అడ్డుకున్నారు.
వ్యభిచార కేంద్రాల్లో 5, 6, 8 తరగతుల విద్యార్థినులు..! గుండె చెరువయ్యే వాస్తవాలు..!!
ధర్మపురి సీఐ లక్ష్మీబాబు ఆధ్వర్యంలో ఆదివారం దాడులు చేసి.. ఆరు కేంద్రాల నిర్వాహకులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ కేసు వివరాలను వెల్లడించారు. పట్టణంలోని దుర్గా కాలనీలో చాలా ఏళ్లుగా వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి బాలికలను కొనుగోలు చేసి తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెడుతున్నారు.
ధర్మపురిలో వ్యభిచార కేంద్రాలపై దాడులు..! వెలుగులోకి భయంకర దారుణాలు..!!
ఇటీవల కరీంనగర్తోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన ఐదుగురు బాలికలను వ్యభిచార కేంద్రాల నిర్వాహకులు కొనుగోలు చేశారు. వారిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపేందుకు రంగం సిద్ధం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలికల సంరక్షణ అధికారులతో కలిసి దాడులు చేశారు. ఆయా కేంద్రాల నుంచి బాధితులను విడిపించి వారి వివరాలను సేకరించారు.
10 వేలకు ఇంటర్ బాలిక కొనుగోలు..! పరాకాష్టకు చేరిన కేటుగాళ్లు..!!
కరీంనగర్కు చెందిన ఇంటర్ చదువుతున్న 17 ఏళ్ల అమ్మాయిని 10 వేల రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. మిగతా వారు 12, 12, 07, 10 ఏళ్ల వయసు గల విద్యార్థినులేనని పోలీసులు తెలిపారు. బాధితుల్లో ధర్మపురిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 5, 6, 8వ తరగతులు చదువుతున్న విద్యార్థులు సైతం ఉన్నారని పేర్కొన్నారు.
పోలీసుల సోదాలు..! ఆరు కేంద్రాల నిర్వాహకుల అరెస్టు..!!
వీరిని చిన్న వయసులోనే కొనుగోలు చేసి పాఠశాలల్లో చేర్పించి బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నట్లు వివరించారు. వ్యభిచార గృహాల నిర్వాహకులపై కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. బాధితులను కరీంనగర్లోని బాలికల సంరక్షణ కేంద్రానికి తరలించామన్నారు.