బస్సు చక్రాల కింద నలిగి చిన్నారి మృతి, మహిళ అనుమానాస్పద మృతి
హైదరాబాద్: పాఠశాల బస్సు ఢీకొని ఎల్కేజీ విద్యార్థి మృతి చెందిన సంఘటన శుక్రవారం ఉదయం చింతల్లోని వివేకానంద నగర్ కాలనీలో చోటు చేసుకుంది. విజ్ఞాన సుధ టాలెంట్ స్కూల్ వద్ద ఈ సంఘటన జరిగింది. విద్యార్థి బస్సు దిగిన తర్వాత, వారు లోపలకు వెళ్లకముందే డ్రైవర్ బస్సును రివర్స్ తీయడంతో ప్రమాదం జరిగింది.
జశ్వంత్ వయస్సు నాలుగేళ్లు. అదే బస్సులో పాఠశాల వద్ద బస్సు దిగాడు. విద్యార్థులు ఇంకా అందరూ స్కూల్ లోపలికి వెళ్లలేదు. ఆ సమయంలో డ్రైవర్ బస్సును రివర్స్ తీశాడు. విద్యార్థి వెనుక టైరు కింద పడి నలిగిపోయాడు. అతనిని స్థానిక మల్లారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు.
జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. వారు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఉదయాన్నే రెడీ అయి స్కూలుకు బయలుదేరిన తన కొడుకు నిమిషాల్లోనే మృతి చెందాడన్న మరణవార్త విని రోదిస్తున్నారు.
మేడపై నుంచి కిందపడి గృహిణి మృతి
అనుమానాస్పద స్థితిలో మేడపై నుంచి కిందపడిన మహిళ మృతి చెందింది. ఈ ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే, ప్రమాదవశాత్తు మేడపై నుంచి కిందపడిందని అత్తింటి వారు చెబుతుండగా, వరకట్న వేధింపుల వల్లే భరించలేక ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
వరంగల్ జిల్లా పాములూరుకు చెందిన అశోక్ బాబు తన కూతురు శ్వేతను ఏడాది క్రితం సాల్వాయి గ్రామానికి చెందిన శరత్ కుమార్కు ఇచ్చి పెళ్లి చేశాడు.
పెళ్లి తర్వాత వీరు హైదరాబాద్ వచ్చారు. కొద్ది రోజులు కాపురం బాగానే సాగింది. పెళ్లి సమయంలో రూ.4 లక్షల కట్నం మాట్లాడుకున్నారు. రూ.3 లక్షలు ముట్టాయి. మిగతా లక్ష రూపాయల కోసం ఆ తర్వాత వేధింపులు ప్రారంభమయ్యాయని అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.