రెడ్డి అభ్యర్థులతో ఎమ్మెల్సీ బరిలోకి టీఆర్ఎస్.. కేటీఆర్ జోక్యంతో మాజీ స్పీకర్కు మొండిచేయి..?
హైదరాబాద్ : ఉద్యమ ప్రస్థానంతో తెలంగాణలో రాజకీయ శక్తిగా ఎదిగిన టీఆర్ఎస్ క్రమక్రమంగా తిరుగులేని పార్టీగా అవతరించింది. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడంతో ఆచితూచి వ్యవహరిస్తోంది. అలాంటి క్రమంలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుసరిస్తున్న వ్యూహంపై భిన్నరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మూడు స్థానాలకు గాను అన్నిచోట్ల రెడ్డి అభ్యర్థులను ఎంపిక చేయడం కొత్త చర్చకు దారి తీసింది.
ఇప్పటికే సామాజిక న్యాయానికి పాతర వేసిందనే ఆరోపణలు మూటగట్టుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ.. మూడింటికి మూడు చోట్ల రెడ్లను ప్రకటించడం చర్చానీయాంశమైంది. వెనుకబడిన తరగతుల వారిని రాజకీయంగా అణగదొక్కాలనే కుట్ర జరుగుతోందనే ఆరోపణలకు తోడు టీఆర్ఎస్ తీసుకున్న తాజా నిర్ణయం హాట్ టాపికయింది.
3 స్థానాలపై కన్ను..!
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడంతో.. స్థానిక సంస్థల కోటాలో జరగనున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ పెద్దలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నల్గొండ, రంగారెడ్డి, వరంగల్ స్థానాలను టీఆర్ఎస్ ఖాతాలో వేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆ క్రమంలో ఆచితూచి నిర్ణయం తీసుకుని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బలమైన అభ్యర్థులను రంగంలోకి దించేలా ప్లాన్ చేశారు.
నల్గొండ నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో ఓటమి చవిచూసిన తేరా చిన్నపరెడ్డికే ఈసారి మళ్లీ అవకాశమిచ్చారు. ఇక రంగారెడ్డి జిల్లా నుంచి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డికి ఛాన్సిచ్చారు. అటు వరంగల్ నుంచి మాజీ స్పీకర్ మధుసూదనచారిని కాదని.. కేటీఆర్ సన్నిహితుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి టికెటిచ్చారు. ఈ ముగ్గురిని గెలిపించే బాధ్యత పలువురు మంత్రులకు అప్పజెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక్కో స్థానానికి నలుగురు చొప్పున మంత్రులను కేటాయించడం చర్చానీయాంశమైంది.
ప్రశ్నిస్తే ప్రజలను బెదిరిస్తున్న ఎమ్మెల్యే.. టీఆర్ఎస్ నయా లీడర్ గిరి
కొడుకు మాట మీద..!
విజయావకాశాలను బేరీజు వేసుకుని టీఆర్ఎస్ అధిష్టానం ఆ ముగ్గురిని సెలెక్ట్ చేసినట్లు కనిపిస్తోంది. అయితే మూడు స్థానాల్లో కూడా రెడ్డి అభ్యర్థులను ఎంపిక చేయడం చర్చానీయాంశంగా మారింది. రంగారెడ్డి జిల్లా నుంచి గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పట్నం మహేందర్ రెడ్డి.. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కేసీఆర్ కు విధేయుడిగా ముద్రపడ్డ మహేందర్ రెడ్డికి మరోసారి అవకాశమిచ్చేందుకే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం వెనుక.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ రెడ్డి ఉద్యమ సమయంలో పెద్దగా కనిపించకపోయినా.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేటీఆర్ కు సన్నిహితుడిగా మారారు. కేటీఆర్ వరంగల్ పర్యటనకు వెళ్లినప్పుడల్లా కార్యకర్తల సమీకరణ దగ్గర్నుంచి కార్యక్రమం విజయవంతమయ్యేదాకా ఆ బాధ్యతలను శ్రీనివాస్ రెడ్డి తన భుజస్కందాలపై మోసారనే టాక్ ఉంది. అయితే మాజీ స్పీకర్ మధుసూదనచారికి ఇవ్వాల్సిన వరంగల్ ఎమ్మెల్సీ టికెట్.. కేటీఆర్ జోక్యంతో శ్రీనివాస్ రెడ్డికి దక్కిందనే చర్చ నడుస్తోంది. తనయుడు చెప్పినట్లే కేసీఆర్ కూడా ఆయనకే జై కొట్టినట్లు తెలుస్తోంది.
సామాజిక న్యాయమెక్కడ..?
పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిషత్ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆ సంఘాల నేతలు బహిరంగ ఆరోపణలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో చాలాచోట్ల రిజర్వేషన్లకు తూట్లు పొడిచి బీసీలకు, వెనుకబడిన తరగతులకు అన్యాయం చేశారనే వాదనలు జోరందుకున్నాయి.
ఆ క్రమంలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు చోట్ల టీఆర్ఎస్ రెడ్డి అభ్యర్థులను ప్రకటించడం హాట్ టాపికయింది. వెనుకబడిన తరగతులకు పెద్దపీట వేస్తామని చెప్పే టీఆర్ఎస్.. క్షేత్రస్థాయిలో అన్యాయం చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. సామాజిక న్యాయమంటూ గొంతు చించుకునే టీఆర్ఎస్ పెద్దలు.. మూడు స్థానాల్లో రెడ్లను ఎంపికచేయడంపై సమాధానం చెప్పాలనేది కొందరి డిమాండ్