హెరిటేజ్ ప్లాంట్లో కరోనా కలకలం.. నిబంధనలు బేఖాతరు..? భయాందోళనలో స్థానికులు..!
హైదరాబాద్లోని ఉప్పల్ హెరిటేజ్ ప్లాంట్లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. మొదట ప్లాంట్లో పనిచేస్తున్న ఓ సెక్యూరిటీ గార్డుకు కరోనా పాజిటివ్గా తేలింది. ఆ సెక్యూరిటీ గార్డు ద్వారా అతని తల్లిదండ్రులకు కూడా వైరస్ సోకింది. అయితే ప్లాంట్లో పాజిటివ్ కేసు నమోదైనా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ ఆ ప్లాంట్ను నిర్వహించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్లాంట్ను మూసివేయాలంటూ తాజాగా అక్కడి స్థానికులు హెరిటేజ్ ఎదుట ధర్నాకు దిగారు. కరోనా పాజిటివ్ కేసు నమోదైనా.. ప్లాంట్ను నిర్వహిస్తుండటంతో.. వైరస్ ఎక్కడ తమకు సోకుతుందోనని భయాందోళనకు గురవుతున్నట్టు వాపోయారు.
సెక్యూరిటీ గార్డుకు పాజిటివ్గా తేలడంతో.. అతనితో కలిసి పనిచేసిన మరో ఏడుగురు సిబ్బందిని హోం క్వారెంటైన్ చేసి స్టాంపులు కూడా వేశారు. అయితే క్వారెంటైన్లో ఉన్నప్పటికీ.. విధులకు రావాల్సిందేనని యాజమాన్యం వారిపై ఒత్తిడి తెస్తోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్లాంట్ నిర్లక్ష్యం పట్ల అధికారులు చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.
Recommended Video
తెలంగాణలో కొత్తగా మరో 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1009కి పెరిగింది. మంగళవారం (ఏప్రిల్ 28) నమోదైన కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోవే కావడం గమనార్హం. మంగళవారం మరో 42 మంది డిశ్చార్జి అయ్యారని మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు.ప్రస్తుతం 610 యాక్టివ్ కేసులకు చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. వీరందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. ఎవరి పరిస్థితి విషమంగా లేదని స్పష్టం చేశారు. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోందన్నారు. మే 8 వరకు రాష్ట్రం కరోనా ఫ్రీ స్టేట్గా మారాలని ఆశాభావం వ్యక్తం చేశారు.