సిరిసిల్ల అగ్రహారం గుట్టల్లో... కలకలం రేపిన ఘటన... స్థానికుల రాకతో పరార్...
కాలం ఎంతో మారిందనుకుంటాం... కానీ కొన్ని సంఘటనల గురించి విన్నప్పుడు మారాల్సింది ఇంకా చాలా ఉందనిపిస్తుంది. జబ్బు చేస్తే ఆస్పత్రికి వెళ్లడం బదులు భూత వైద్యులు,బాబాలను ఆశ్రయించేవారు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. మెడిసిన్ కంటే తాయెత్తులు,పూజలు,మంత్రాల పైనే వాళ్లకు నమ్మకం ఎక్కువ. కానీ అవేవీ తమను కాపాడలేవని తెలిసేలోపే ఆరోగ్యం విషమించి ప్రాణాలు కోల్పోతుంటారు. ఇటీవల మంచిర్యాల జిల్లా కుందారంలో వెలుగుచూసిన ఘటనే ఇందుకు నిదర్శనం.
సిరిసిల్ల అగ్రహారం గుట్టల్లో...
తాజాగా సిరిసిల్లా జిల్లాలోనూ ఇలాంటి తరహా ఘటనే వెలుగుచూసింది. జిల్లాకు చెందిన ఓ దంపతులు ఇటీవల తమ ఆరోగ్యం బాగా లేకపోవడంతో పెద్దూరుకు చెందిన ఓ భూత వైద్యుడిని సంప్రదించారు. ఆరోగ్య సమస్యను తాను నయం చేస్తానని నమ్మించిన ఆ భూత వైద్యుడు... ఆ దంపతులను వేములవాడ మండలంలోని అగ్రహారం గుట్టలోకి తీసుకెళ్లాడు. అక్కడ దంపతులిద్దరినీ కూర్చోబెట్టి క్షుద్ర పూజలు మొదలుపెట్టాడు.
స్థానికులు నిలదీయడంతో పరారీ...
అగ్రహారం గుట్టల్లో క్షుద్రపూజల సమాచారం స్థానికులకు తెలియడంతో... కొంతమంది అక్కడికి చేరుకుని వారిని ఆరా తీశారు. ఏం చేస్తున్నారంటూ నిలదీశారు. ఇంటి సమస్యలకు,ఆరోగ్య సమ్యలకు పూజలు చేయించుకుంటున్నామని ఆ దంపతులు బదులిచ్చారు. అదేదో ఇంట్లోనే చేసుకోవచ్చు కదా అని స్థానికులు ప్రశ్నించగా... కరోనా వల్ల ఇంటి వద్దక కుదరలేదని,అందుకే ఇక్కడికి వచ్చామని చెప్పారు. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారిని బతిమాలుతూనే అక్కడినుంచి పారిపోయారు. స్థానికులు ఈ తతంగాన్ని వీడియో తీయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
మంచిర్యాల ఘటన మరువకముందే...
ఇటీవల మంచిర్యాల జిల్లాలోనూ ఇలాంటి ఘటనే వెలుగుచూసిన సంగతి తెలిసిందే. జైపూర్ మండలం కుందారం గ్రామానికి చెందిన రజిత (24) అనే బాలింతకు ఎవరో చేతబడి చేశారన్న కారణంతో కుటుంబ సభ్యులు,బంధువులు కలిసి ఓ భూత వైద్యుడిని ఇంటికి రప్పించారు. అతను భూత వైద్యం పేరుతో,దెయ్యాన్ని తరిమేస్తున్నానని చెప్పి ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి జారుకుంది. ఆపై కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా... అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. రజిత మృతితో నెల వయసు కూడా లేని ఆమె కొడుకు తల్లిని కోల్పోయినట్లయింది.
Recommended Video
భూత వైద్యాన్ని నమ్మి ఇల్లు,ఒళ్లు గుల్ల..
భూత వైద్యం పేరుతో కొంతమంది ఇల్లు,ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. హేతుబద్దంగా ఆలోచించలేక మాయ మాటలకు లొంగిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. భూత వైద్యులు కూడా గ్రామాల్లో తమ గురించి గొప్పగా ప్రచారం చేసుకుంటూ అమాయకులను ఆకర్షిస్తున్నారు.ఎలాంటి సమస్యలనైనా పరిష్కరిస్తామని చెప్పి అందినకాడికి దోచుకుంటున్నారు. కొన్నిసార్లు మహిళలపై భూత వైద్యులు లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటనలు కూడా లేకపోలేదు. ఇలాంటివాళ్లను నమ్మి మోసపోవద్దని పోలీసులు కూడా గతంలో ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారు. కనీసం ఇలాంటి ఘటనలు వెలుగుచూసినప్పుడైనా ప్రజలు నిజాలను గ్రహించే ప్రయత్నం చేస్తే మూఢ నమ్మకాలకు దూరంగా ఉండవచ్చు.