లాక్ డౌన్ వేళ.. మీ వాహనాలు భద్రం .. సీజ్ అయితే చుక్కలే
కరోనా వైరస్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సవాల్ విసురుతుంది . కరోనా కట్టడి కోసం యుద్ధం చేస్తున్న సర్కార్ కు లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన ఇబ్బందికరంగా మారటంతో కొరడా ఝుళిపిస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి బయటకు వస్తే వాహనాలు సీజ్ చేస్తున్న పరిస్థితి అటు వాహన చోదకులకు మాత్రమే కాదు ఇటు పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే లాక్ డౌన్ నేపధ్యంలో చాలా మంది ఇళ్ళ నుండి బయటకు రాక వాహనాలు మొరాయించే పరిస్థితి వచ్చింది . ఇక ఇప్పుడు బయట పోలీసులు వాహనాలు సీజ్ చేస్తే మూడు నెలల పాటు బయటకు వచ్చే ఛాన్స్ లేదని చెప్తున్నారు పోలీసులు . దీంతో తర్వాత ఆ వాహనాలు అసలు కదులుతాయా అన్న భయం ఇప్పుడు వాహన చోదకులకు పట్టుకుంది.
అనంతపురం ఎఫెక్ట్ ... చిత్తూరు జిల్లాలో అలెర్ట్ .. 13 మంది తహసీల్దార్లకు కరోనా టెస్టులు
లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన ... వాహనాలు సీజ్ ..కేసులు నమోదు
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు . హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు కరోనా కట్టడి కోసం పటిష్టంగా అమలుచేస్తున్న లాక్డౌన్లో భారీగా వాహనాలు సీజ్ చేస్తున్నారు . అకారణంగా రోడ్డెక్కి పోలీసులకు చిక్కారో ఇక చుక్కలు చూడాల్సిందే అంటున్నారు . మీ వాహనం తిరిగి మళ్లీ మీ చేతికి రావాలంటే మూడు నెలల సమయం పట్టవచ్చని చెప్తున్నారు. ఇక లాక్డౌన్ వేళ ఐపీసీ 188 సెక్షన్ కింద కేసులు నమోదు చేసి సీజ్ చేస్తున్న వాహనాలకు సంబంధించి వాహన చోదకులకు జైలుశిక్ష పడే అవకాశముందని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.
వాహనాలపై ప్రయాణాల విషయంలో రూల్స్ అతిక్రమిస్తున్న వాహన చోదకులు
లాక్ డౌన్ కు ముందే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారి వాహనాలు వేల సంఖ్యలో పోలీస్ స్టేషన్ ల వద్ద ఉన్నాయి. ఇక ఇప్పుడు లాక్ డౌన్ ఉల్లంఘిస్తున్న వారి వాహనాలు పెట్టటానికి పోలీసులకు స్థలాభావం ఏర్పడుతుంది. హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల ప్రజలు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. బైక్పై ఒకరికి మించి ప్రయాణం చెయ్యరాదని చెప్పినా చేస్తున్నారు . కారులో ఇద్దరికి మించి ఎక్కువ మంది ప్రయాణిస్తూ నిబంధనలను అతిక్రమిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వాహనాలు సీజ్
మరికొందరు సరైన పత్రాలు లేకుండానే రోడ్డెక్కి పోలీసుల తనిఖీల్లో దొరికిపోతున్నారు. ఫలితంగా ఒక్క హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో 35వేల వాహనాలు సీజ్ అయ్యాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో వాహనాలు సీజ్ అయ్యాయి. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న కారణంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. లాక్డౌన్ కాలపరిమితి పెంచడంతో పాటు ఎప్పుడు ఎత్తేస్తారన్న దానిపై స్పష్టత లేదు . దీంతో అటు వాహన చోదకులకు సీజ్ అయిన తమ వాహనాల విషయంలో టెన్షన్ పట్టుకుంటుంది .
బయటకు రావటానికి మూడు నెలల కాలం .. వాహనాలు పాడైపోయే ప్రమాదం
పోలీసులు సీజ్ చేసిన వాహనాలు అసలు వినియోగంలో లేకుంటే మొరాయిస్తాయి .ఇక మూడు నెలలపాటు పక్కన పడేసి ఉంటే వాటి కండిషన్ ఏమిటనేదానిపై వాహన యజమానులు టెన్షన్ పడుతున్నారు. నెలల పాటు బండి స్టార్ట్ చేయకుండా పక్కన పెట్టేయడం వల్ల ఆయా వాహనాలు కండిషన్ చెడిపోయే పరిస్థితి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత కోర్టు ద్వారా సదరు వాహనాన్ని తీసుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చనే వాదన పోలీసు వర్గాల నుంచి వినిపిస్తోంది. అయినప్పటికీ తామేమీ చెయ్యలేం అంటున్నారు.
సీజ్ అయితే సినిమా చూస్తారని హెచ్చరిస్తున్న పోలీసులు .. తస్మాత్ జాగ్రత్త
ఇక తమ వాహనాలను విడిచిపెట్టండి మహా ప్రభో మళ్ళీ బయటకు రాము అన్నా సరే సీజ్ చేసిన వాహనాలు విడిచే ప్రసక్తే లేదని చెప్తున్నారు పోలీసులు. అందుకే సీజ్ అయితే సినిమా తప్పక కనిపిస్తుంది. కనుక ఇప్పుడైనా లాక్ డౌన్ నిబంధనలు పాటించి వాహనాలను భద్రంగా చూసుకోండి. సీజ్ అయ్యే దాకా చేసుకుంటే చెప్పనలవి కాని తిప్పలు పడాల్సి వస్తుందని పోలీసులే చెప్తున్నారు. సో... తస్మాత్ జాగ్రత్త !