లాక్ డౌన్ ఎఫెక్ట్ ... కోలుకున్న కోడి ధరలు
కరోనా వైరస్ దెబ్బకు నిన్నటి దాకా కుదేలైన పౌల్ట్రీ లాక్ డౌన్ నేపధ్యంలో కొద్దిగా కోలుకునే పరిస్థితి వచ్చింది .కరోనాతో పౌల్ట్రీ పరిశ్రమ కోలుకోలేని నష్టాల్లో కూరుకుపోగా లాక్ డౌన్ కాస్త పౌల్ట్రీకి ఊరటనిస్తుంది. ఇక నిత్యావసరాలు, కూరగాయలు, చికెన్, మటన్ , చేపలు తదితరాలు మాత్రమే విక్రయిస్తున్న నేపధ్యంలో కోళ్ళ ధరలకు రెక్కలు వచ్చాయి .
చికెన్ అంటేనే ఆమడ దూరం పారిపోయిన ప్రజలు
కరోనా ఎఫెక్ట్ తో నిన్నా మొన్నటి దాకా కోడి తినాలంటేనే ప్రజలు భయపడ్డారు . కోడి తింటే కరోనా వస్తుందని భావించిన నేపధ్యంలో చికెన్ వైపు ఎవరూ చూడలేదు . కరోనా వైరస్ తో పాటు కోళ్ళకు కొక్కెర వ్యాధి వస్తుందన్న భయం ప్రజలను చికెన్ అంటేనే మాకొద్దు అనేలా చేసింది . ఇక చికెన్, గుడ్లు తింటే కరోనా వస్తుందని సోషల్ మీడియాలో పలు ప్రచారాలు కూడా జరిగాయి. దీంతో కోళ్ళను కొనే వాళ్ళు లేక, వాటిని మేపలేక చాలా మంది పౌల్ట్రీ ఫాం ల యజమానులు వాటిని ఫ్రీగా ఇచ్చేశాయి. ఇక అంతేకాదు కొందరు కోళ్ళను గొయ్యి తీసి బతికుండగానే పూడ్చేశారు. ఇక దీంతో చికెన్, గుడ్డు ధరలు అమాంతం పడిపోయాయి.
మళ్ళీ పెరిగిన చికెన్ ధరలు .. రూ.170లకి పైగా పలుకుతున్న కిలో
20 రూపాయలకు కిలో చికెన్ అన్నా కొనే నాధుడు లేరు. ఇక ఈ పరిస్థితిలో పౌల్ట్రీ పరిశ్రమ నష్టాల్లో కూరుకపోయింది. కోట్లలో కష్టాలను చవిచూడాల్సిన వచ్చింది. పలువురు మంత్రులు కూడా చికెన్ ఫెస్టివల్ నిర్వహించి మంత్రులు చెప్పినా ప్రజలు కన్నెత్తి చూడలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. ఇప్పుడు నిత్యావసరాలు మాత్రమే మార్కెట్ లో లభిస్తున్న తరుణంలో చికెన్ , ఎగ్స్ తింటే బలంగా ఉంటామని , కరోనాను ఎదుర్కోవచ్చని చెప్తున్న నేపధ్యంలో గత వారం రూ.80లు పలికిన కిలో చికెన్ ధర.. లాక్డౌన్ పరిస్థితిలో కూడా రూ.170లకి పైగా పలుకుతోంది. అయితే దీనికి ప్రధాన కారణం లాక్ డౌన్ అంతే కాదు కోళ్ల పెంపకం తగ్గటం కూడా అంటున్నారు పౌల్ట్రీ వ్యాపారులు .
సప్లై తగ్గడంతో చికెన్ ధరలు పెరుగుతున్నాయన్న వ్యాపారులు
మొన్నటి దాకా కొనండి బాబూ అన్నా ఎవరూ కొనలేదు. దీంతో చాలామంది పౌల్ట్రీ నిర్వాహకులు కోళ్ళను మేపలేక వాటి దాణా ఖర్చు కూడా రాక అమ్ముకున్నారు. ఫ్రీ గా ఇచ్చేశారు . చాలా పౌల్ట్రీలు కూడా మూత పడ్డాయి. సప్లై తగ్గడంతో చికెన్ ధరలు పెరుగుతోందని, అలాగే గుడ్లకు డిమాండ్ బాగా పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక కరోనాను ఎదుర్కోవటం కోసం స్వయంగా సీఎం కేసీఆర్ ప్రెస్మీట్లో చెప్పడంతో ప్రజలు తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
Recommended Video
ఫ్రీగా ఇచ్చినప్పుడు తీసుకోకుండా ఇప్పుడు మళ్ళీ ఎక్కువ ధరకు కొంటున్న ప్రజలు
చికెన్, గుడ్లు, పాలు, పండ్లు ఆరోగ్యానికి ఎంతో అవసరమని.. అవి తినడం ద్వారా కరోనాను ఎదుర్కునే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని సీఎం కేసీఆర్ స్వయంగా తెలిపారు. ఆయన వ్యాఖ్యలు కూడా చికెన్, గుడ్ల ధరలు పెరగడానికి దోహదం చేశాయని కూడా చెబుతున్నారు చికెన్ వ్యాపారులు. మొత్తానికి పౌల్ట్రీ పరిశ్రమ కాస్త కోలుకుంటుంది . కానీ చికెన్ ప్రియులు ఫ్రీగా ఇచ్చినప్పుడు తినకపోయామే ఇప్పుడు మళ్ళీ ఎక్కువ ధర పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది అని తెగ బాధ పడుతున్నారు .