లాక్ డౌన్ ఎఫెక్ట్ ... మీటర్ రీడింగ్ చూడకుండానే కరెంట్ బిల్ .. ఎలాగంటే
కరోనా వైరస్ ను కట్టడి చెయ్యటానికి ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. ఇక ఈ నేపధ్యంలో జనజీవనం స్తంభించింది. ఎవరూ ఇళ్ళు దాటి బయటకు రావద్దని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చెయ్యటంతో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇక నిత్యాసరాలకు మాత్రమే బయటకు వస్తున్న పరిస్థితి . ఇక ఈ సమయంలో కరెంట్ బిల్లులు మూడు నెలల పాటు చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రం మూడు నెలల మారటోరియం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ కు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే సమయంలో కరెంట్ బిల్లు లెక్కించే విషయంలో కూడా ఇళ్ళకి వెళ్ళకుండానే లెక్కించాలని నిర్ణయం తీసుకుంది.
లాక్ డౌన్ ఎఫెక్ట్ .. వాహన డాక్యుమెంట్ల రెన్యువల్ కు సంబంధించి కేంద్రం మరో కీలక నిర్ణయం
రీడింగ్ చూసి కరెంట్ బిల్లులు ఇవ్వటానికి ఇబ్బంది
ప్రతి నెల మీటర్ రీడింగ్ చూసి బిల్ ఇచ్చే విధానం ఉండగా కరోనా భయం నేపధ్యంలో ఎవరూ కొత్త వారిని ఇళ్ళకు రానివ్వటం లేదు . ఇక ఈ సమయంలో ఇళ్ళకు వెళ్లి కరెంట్ మీటర్ ప్రకారం రీడింగ్ చూసి బిల్లు వెయ్యటం కష్టం .జనాలు కొత్త వారిని రానిచ్చే పరిస్థితి లేదు. అలాగే విద్యుత్ సంస్థలు సైతం విద్యుత్ మీటర్ రీడింగ్ చూసి బిల్లు ఇచ్చేవారిని పంపించే పరిస్థితి లేకపోవటంతో ఈ పరిస్థితుల్లో మరి విద్యుత్ బిల్లుల లెక్కింపు చెయ్యటానికి కొత్త విధానం అనుసరించాలని నిర్ణయం తీసుకుంది .
మూడు నెలల సగటును బట్టి ఈ నెల కరెంట్ బిల్లు నిర్ణయం
ఇందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఓ ఆలోచన చేస్తోంది. ఫిబ్రవరికి ముందు వినియోగదారుడు చెల్లించిన మూడు నెలల బిల్లును చూసి అందులో సగటు ప్రాతిపదికన మార్చినెల విద్యుత్ వాడకాన్ని అంచనావేసి ఆన్లైన్లో పొందుపరచాలని నిర్ణయించింది. అంటే గడచిన మూడునెలల్లో మీరు మొత్తం రూ.1800లు చెల్లిస్తే ఈ మొత్తాన్ని మూడుతో డివైడ్ చేసి రూ.600లు ఈ నెల బిల్లుగా లెక్కిస్తారు. దీనిపై డిస్కంలు ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయకపోయినా గతనెలలో వసూళ్లలో 28 శాతం తగ్గుదల కనిపించడంతో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇక ఈ బిల్లును కూడా ఇంటికి ఇవ్వకుండా ఆన్లైన్ లో పొందుపరుస్తారు .
ఆన్లైన్ లో బిల్లులు.. చెల్లింపులు .. డిస్కంల విజ్ఞప్తి
ఇక సంబంధిత కరెంట్ బిల్లులను వినియోగదారులు కూడా ఆన్లైన్లోనే చెల్లింపులు చేయాలి. ఇందుకు టీఎస్ఎస్పీడీసీఎల్ వెబ్ సైట్, మొబైల్ యాప్, ఇతర యాప్లు, టీఎస్ఆన్లైన్, మీ సేవల్లో చెల్లించవచ్చునని డిస్కంలు విజ్ఞప్తిచేస్తున్నాయి . లాక్డౌన్ అనంతరం మరుసటి నెల మీటర్ రీడింగ్ ఆధారంగా బిల్లులు జారీచేస్తారు.అయితే అప్పుడు ఎలా లెక్కిస్తారనేది మాత్రం కాస్త ఆలోచించాల్సిన విషయమే . మొత్తానికి కరోనా ప్రభావంతో కొనసాగుతున్న లాక్ డౌన్ అటు ప్రజలకే కాదు ఇటు ప్రతి ఒక్క వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది.