లాక్ డౌన్ ఎఫెక్ట్..భిక్షాటన చేస్తున్న అర్చకుల దైన్యం..సర్కారు చెయ్యలేదా న్యాయం
కరోనా నియంత్రణా చర్యల్లో భాగంగా దేశమంతా లాక్ డౌన్ విధించడంతో ఆ ప్రభావం ఆలయాలలో అర్చకత్వం మీద ఆధారపడి జీవనం సాగించే వారి బతుకులను కుదేలు చేస్తుంది. ఆలయాల్లో పూజలు చేసి జీవనం సాగించే అర్చకుల జీవనం ఇప్పుడు చాలా దుర్భరంగా మారింది. ఆలయాల్లో గంట మోగక చాలా రోజులైపోయింది. ఒకపక్క వైన్స్ షాపులు తెరిచి జనాలను కంట్రోల్ చేస్తూ మరీ మందుబాబులను ప్రోత్సహిస్తున్న తెలంగాణా సర్కార్ , చిన్న చిన్న దేవాలయాలలో అర్చకత్వం మీద , అలాగే భక్తులు ఇచ్చే దక్షిణ మీద ఆధారపడి జీవనం సాగించే వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటంతో వారి జీవితాలు వీధిన పడుతున్నాయి.
జీవనోపాధి లేక అవస్థలు పడుతున్న అర్చకులు
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించటంతో అర్చకుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. యజ్ఞాలు , యాగాలు వంటి క్రతువులు లేవు , గుడిలో భక్తుల రాకపోకలు లేవు . ఇక పూజలు, పునస్కారాలు , వ్రతాలు నిర్వహించే వారే లేరు . లక్షల్లో ఉన్న అర్చకులు లాక్ డౌన్ తో పడరాని పాట్లు పడుతున్నారు . నిత్యం భగవంతునికి నైవేద్యం పెట్టే అర్చకులకే ఆకలి తీరని పరిస్థితి తాజా పరిణామాల నేపధ్యంలో నెలకొంది. దీంతో చాలా మంది అర్చకులు రోడ్డున పడుతున్నారు. భిక్షాటన చెయ్యాల్సిన దుర్భర పరిస్థితులను చూస్తున్నారు.
ఆలయాలలోకి భక్తులు రాక అర్చకుల బతుకు భారం
కాస్త పెద్ద పెద్ద దేవాలయాల్లో అర్చకులకు జీతాల్లో సగం అయినా ప్రభుత్వం ఇస్తుంది. కానీ దేవాదాయ శాఖ పరిధిలో చిన్న చిన్న దేవాలయాల్లో అర్చకులు ధూప, దీప నైవేద్యాల కోసం మాత్రమే ప్రభుత్వం కొంత నిధులు ఇస్తుంది . అవి ఆలయాల్లో నిత్య పూజలకే సరిపోతాయి. కానీ అర్చకులకు ఆలయాల్లో నిత్యం పూజలు నిర్వహిస్తున్నా భక్తుల రాక లేక బతుకు భారంగా మారుతుంది. ప్రభుత్వ సాయం కోసం నిరుపేద అర్చకులు దీనంగా చూస్తున్నారు. ఎవర్ని కదిలించినా కంటికి కడివెడు దుఃఖంతో ఉన్నారు.
శుభ, అశుభ కార్యాల క్రతువులు నిర్వహించే బ్రాహ్మణుల దైన్యం
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఆలయాల్లో మాత్రమే కాదు పెళ్ళిళ్ళు, చావులు వంటి శుభ, అశుభ క్రతువులు నిర్వహించే పురోహితులు సైతం ఆకలి కేకలు వేస్తున్న పరిస్థితి ఉంది. "మాంగల్యం తంతు నామేనా మమ జీవన హేతునా" అన్న మంత్రోచ్చారణ అవసరమే లేకుండా పెళ్ళిళ్ళు జరిగిపోతున్న తరుణంలో పురోహితుల జీవనం కుదేలవుతుంది . ఇక అంతే కాదు ఎవరైనా మరణించినా పట్టుమని పది మంది కూడా రాకుండా అంతిమక్రియలు కొనసాగుతున్న వేళ దిన ఖర్మలు చెయ్యటానికి అర్చకులను పిలిచే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దీంతో లక్షల మంది అర్చకులు కుటుంబాలను పోషించలేక దీనంగా ప్రభుత్వ సాయం కోసం చూస్తున్నారు .
ఏపీ తరహాలో తెలంగాణాలోనూ పేద అర్చకులను ఆదుకోవాలని వినతి
ఇక కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆలయాల్లో భక్తుల దర్శనాల నిలిపివేతతో ఆదాయం కోల్పోయిన అర్చకులను ఆదుకోవటం కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి చిన్న చిన్న ఆలయాలలో పని చేసే అర్చకులకు 5 వేల రూపాయలు గ్రాంట్ గా ఇచ్చి ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే . ఇక ఈ క్రమంలో తెలంగాణా రాష్ట్రంలోని అర్చకులు కూడా తెలంగాణా ప్రభుత్వం తమ సమస్యలను అర్ధం చేసుకుని నిరుపేద బ్రాహ్మణులకు అండగా ఉంటుందని ఎదురు చూస్తున్నారు. తెలంగాణా సర్కార్ ఆ దిశగా నిర్ణయం తీసుకుంటే అర్చకులకు కొంత మేర కష్టాలకు ఉపశమనం దొరుకుతుంది.
Recommended Video
మందుబాబులకు మినహాయింపు ఇచ్చిన సర్కార్ అర్చకుల విషయంలో ఆలోచించలేదా ?
ఇక అలాగే లాక్ డౌన్ నిబంధనల నుండి వైన్స్ కు మినహాయింపు ఇచ్చిన సర్కార్, ఒక పద్దతిలో దర్శనాలు చేసుకునేలా ఆలయాలకు కూడా మినహాయింపు ఇస్తే బాగుంటుందని , కాస్త పేద అర్చకులను ఆదుకున్నట్టు అవుతుందని అంటున్నారు అర్చకులు . ఇక ప్రభుత్వం ఆలయాల్లో దర్శనాలకు భక్తులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే భౌతిక దూరం పాటిస్తూ ప్రజలు పూజలు నిర్వహించుకునే వీలుంటుంది . ఇక భక్తులు ఆలయాలకు వెళ్తే వారిచ్చే దక్షిణతో అర్చకులకు పూట గడుస్తుంది.