లాక్ డౌన్ ఎఫెక్ట్ ... గర్భిణీల ప్రసవ వేదన అరణ్య రోదన .. పట్టించుకోని వైద్య సిబ్బంది
గర్భిణీల ప్రసవ వేదన అరణ్య రోదనగా మారుతుంది . ఏ రాష్ట్రంలో చూసినా కరోనా బాధితుల కోసం చేస్తున్న అత్యవసర సేవలు మినహాయించి మిగతా వైద్యసేవలు చెయ్యటం లేదు . దీంతో ముఖ్యంగా పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్తున్న గర్భిణీల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది . సరైన వైద్య సిబ్బంది ఆస్పత్రుల్లో లేకపోవటం , ప్రైవేట్ ఆస్పత్రుల్లో సైతం వైద్య సేవలు కరోనా ప్రభావంతో నిలిపివెయ్యటంతో గర్భిణీ మహిళలు నరకం చూస్తున్నారు.
గర్భిణీతో నర్సుల చెలగాటం .. గర్భసంచి బయటకు ..బిడ్డను చూడకుండానే తల్లి మృతి
డెలివరీకి వెళ్ళిన మహిళకు డెలివరీ చెయ్యలేమన్న వైద్య సిబ్బంది
మొన్నటికి మొన్న ఏపీలో నర్సుల నిర్వాకంతో గర్భసంచి బయటకు వచ్చి గర్భిణీ స్త్రీ బిడ్డను చూడకుండానే మృతి చెందింది . ఇక తాజాగా తెలంగాణా రాష్ట్రంలో నొప్పులతో ఆస్పత్రికి వెళ్ళిన గర్భిణీకి వైద్యం చెయ్యలేమని వెళ్ళగొట్టిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది .జోగుళాంబ గద్వాల జిల్లా ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఘటన వివరాల్లోకి వెళ్తే అయిజా మండలం యాపదిన్నెకి జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రికి భర్త మహేంద్ర తీసుకొచ్చాడు. జెనీలియా నొప్పులతో ఆస్పత్రికి వెళితే అధిక రక్తపోటు, తక్కువ రక్తం ఉందని వైద్యు లు కాన్పు చేయమనటంతో దిక్కుతోచని స్థితిలో ఆస్పత్రి ఆవరణలో బెంచిపై నొప్పులు పడుతున్న తీరు చూసి భరించలేని భర్త సాయం కోసం వీడియో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దిక్కుతోచని స్థితిలో ఆమె పరిస్థితి వీడియో తీసి సాయం కోసం సోషల్ మీడియాలో షేర్ చేసిన భర్త
ఇక కరోనా వ్యాప్తిని అరికట్టటానికి విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో ఏం చెయ్యాలో పాలుపోని , వేరే ఆస్పత్రికి వెళ్దామన్నా గత్యంతరం లేని పరిస్థితిలో ఆస్పత్రి వద్దే ఉండిపోయారు భార్యాభర్తలు . దిక్కుతోచని స్థితిలో ఆ గర్భిణి ఆసుపత్రి ఆవరణలోనే బెంచీపై పడుకొని తీవ్ర వ్యధను అనుభవించింది . పురిటి నొప్పులతో ఆమె పడుతున్న వేదనను చూడలేక భర్త ఆమె బాధను సెల్ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో చేసిన భర్త పోస్ట్ చూసి అప్పుడు అధికారులు స్పందించారు .డీఎస్పీ యాదగిరి పోలీసు సిబ్బందిని పంపించి వారి పరిస్థితి తెలుసుకుని జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓతో మాట్లాడి గర్భిణిని మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్లో తరలించారు.
Recommended Video
సర్వ సాధారణంగా మారిన గర్భిణీల బాధలు .. ప్రభుత్వాలే స్పందించాలి
ఇక ఇలాంటి ఘటనలు సర్వ సాధారణంగా మారిపోయాయి. కరోనా అత్యవసర వైద్యం మినహాయించి వేరే చికిత్సల మీద దృష్టి పెట్టలేని పరిస్థితి ఉంది. దీంతో చాలా మంది వ్యాధిగ్రస్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా డెలివరీ వంటి అత్యవసర సేవలకై వస్తున్న గర్భిణీల పరిస్థితి ఇలా ఉంది అంటే మిగతా వారి పరిస్థితి మనం ఊహించుకోవచ్చు . ప్రభుత్వాలు కేవలం కరోనాపైన మాత్రమే కాదు ఇతర ఎమర్జెన్సీ సేవల విషయంలో కూడా సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. వైద్యులు , వైద్య సిబ్బంది మానవత్వంతో స్పందించాలి .