లాక్ డౌన్ ఎఫెక్ట్ ... తగ్గిన చోరీలు ..పెరిగిన లిక్కర్ షాపుల లూటీలు
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపధ్యంలో వ్యాప్తిని అరికట్టటానికి చేసిన లాక్ డౌన్ తో దొంగతనాలు బాగా తగ్గాయి. జనాలంతా ఇళ్లకే పరిమితం అయ్యి ఉండటంతో చోరీలకు ఎవరూ సాహసించటం లేదు. ఇక అంతే కాదు రవాణా సౌకర్యం లేని కారణం కూడా దొంగల చేతులు కట్టేసింది . ఇక తగ్గిన దొంగాతనాలతో పోలీసులు ఊపిరి పీల్చుకుందామనుకుంటే లిక్క షాపుల లూటీలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
గాంధీ ఆస్పత్రిలో కరోనా పాజిటివ్ బాధితులకు పౌష్టికాహారం .. మెనూ ఇదే
వైన్స్ షాపులకు కన్నాలు వేసి మరీ లిక్కర్ చోరీ
లాక్ డౌన్ నేపధ్యంలో నిత్యావసరాలు మినహాయించి మద్యం షాపులు కూడా తెరవకుండా నిర్ణయం తీసుకున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక ఈ క్రమంలో చుక్క లేక కిక్కు లేక కునుకు రాక మందుబాబులు ఎంతకైనా తెగిస్తున్న పరిస్థితి పోలీసులకు షాకింగ్ గా అనిపిస్తుంది . పలుచోట్ల మద్యం లేకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు మందుబాబులు .లిక్కర్ దొరక్క వీక్ నెస్ కు గురవుతున్న వారు ఏదైతే అదే అవుతుంది అని ఏకంగా వైన్స్ షాపులకు కన్నాలు వేసి మరీ లిక్కర్ చోరీ చేస్తున్నారు.
ఇటీవల గాంధీ నగర్లో శ్రీ వెంకటేశ్వర వైన్ షాప్ లో లక్ష రూపాయల లిక్కర్ చోరీ
ఇటీవల హైదరాబాద్ నగరంలోని గాంధీ నగర్లో శ్రీ వెంకటేశ్వర వైన్ షాప్ లో రాత్రి వెనుక భాగంలోని రేకులను వంచి లోపలికి వెళ్ళి గోడకు రంధ్రం చేసి చోరీకి పాల్పడ్డారు. సుమారుగా రూ.లక్ష విలువైన పలు బ్రాండ్ల మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. అంతే కాక షాపు డ్రాలో ఉన్న రూ.15వేల నగదును కూడా మాయం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మద్యం షాపు వద్దకు చేరుకుని షాపులో ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించి మందుబాబులే ఈ పని చేశారని తాగేందుకు చేశారా లేకా మద్యాన్ని బ్లాక్లో అమ్ముకునేందుకు చేసారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజాగా గోడకు కన్నమేసి నాచారంగుట్ట షాపు లూటీ
ఇక తాజాగా సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారంగుట్ట పరిసరాల్లో లాక్డౌన్ సందర్భంగా అధికారులు సీల్ చేసిన వైన్స్కు కన్నం వేసి మరీ అందులో ఉన్న మొత్తం మద్యం బాటిళ్లని చోరీ చేశారు . ఇదేదో ప్రొఫెషనల్స్ చేశారని పోలీసులు భావించటం లేదు . తాజా పరిణామాల నేపధ్యంలో మందుబాబులే, ఎవరైనా బ్లాక్ లో విక్రయించే వారి ప్రోద్బలంతో చేసి ఉంటారని భావిస్తున్నారు. నాచారంగుట్ట పరిసరాలలో ఉన్న వైన్స్కు లాక్డౌన్ సందర్భంగా అధికారులు సీల్ వేశారు. ఇక రెండు వారాల నుండి మూసి ఉన్న వైన్స్ గోడకు కన్నం వేసి ఉండటంతో స్థానికులు యజమానులకు సమాచారం అందించారు.
ఇళ్ళలో తగ్గిన దొంగతనాలు .. వైన్స్ లో పెరిగిన చోరీలు
యజమానులు వైన్స్ వద్దకు వెళ్లి చూడగా లోపల ఉన్న మద్యం సీసాలన్నీ చోరీ చేసి కంప్లీట్ గా వైన్స్ లూటీ చేసినట్టు గుర్తించారు . వైన్స్ రూమ్ కు వెనకాల నుంచి గోడ బద్దలు కొట్టిన దొంగలు మొత్తం లూటీ చేశారు. వెంటనే ఎక్సై జ్ అధికారులు, పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలా ఒక్క తెలంగాణాలోనే కాదు ఏపీలోనూ లిక్కర్ షాపులలో చోరీలు బాగా పెరిగిపోతున్నాయి. ఇక ఇది ప్రస్తుతం లాక్ డౌన్ బిజీలో కూడా పోలీసులకు ఇబ్బందిగా మారింది . ఇళ్ళలో దొంగతనాలు లేక ప్రజలు హాయిగా నిద్ర పోతుంటే , ఏ వైన్స్ కు ఎవరు, ఎప్పుడు కన్నం వేస్తారో అని పోలీసులు కాపలా కాయలేక ఇబ్బంది పడుతున్ననారు.
Recommended Video