ఆ నాలుగు జిల్లాల్లో ప్రమాద ఘంటికలు..! లాక్డౌన్ మరింత కఠినతరం చేయనున్న టీ సర్కార్..!
హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పుడుతున్నట్టే కనిపిస్తున్నా కొన్ని జిల్లాల్లో చాపక్రింద నీరులా వ్యాప్తి చెందుతోంది. తెలంగాణలో హైదరాబాద్ తో పాటు మరి కొన్ని జిల్లాల్లో కరోనా వైరస్ మరణ మృదంగం మ్రోగిస్తోంది. లాక్డౌన్ పేరుతో ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నా ఎందుకు పాజిటీవ్ కేసుల సంఖ్య పెరుగుతుందో వైద్యాధికారులకు, ప్రభుత్వ వర్గాలకు అంతిచిక్కని వ్యవహారంగా మారింది. కేసులు ఎక్కువ నమోదు అవుతున్న ప్రదేశాల్లో ఆంక్షలను మరింత కట్టుదిట్టంగా అమలు చేసేందుకు తెలంగాణ సర్కార్ సన్నాహాలు చేస్తోంది.
Recommended Video
కలవర పెడుతున్న కరోన..
ఇందుకు సంబంధించి ఆ నాలుగు జిల్లాల్లో లాక్డౌన్ ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మంగళవారం జరగబోయే మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందంజలో ఉన్న దేశాలు కూడా కరోనా వైరస్ మహమ్మారికి దాసోహం అంటున్నాయి. సరిగ్గా ఇదే పరిస్థితి భారత దేశాన్ని కూడా పట్టి పీడిస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా తన ప్రాతాపాన్ని చూపుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కన్నెర్ర చేస్తూ ప్రభుత్వాలకు సవాల్ విసురుతోంది. అందుకు తగ్గట్టుగానే తెలంగాణలోని ఆ నాలుగు జిల్లాల్లో వేగంగా విస్తరిస్తోంది కరోనా.
ఆ నాలుగు జిల్లాల్లో కరోనా తీవ్ర ప్రభావం..
ఇదిలా ఉండగా తెలంగాణలోని హైదారాబాద్ పరిధిలోనే ఎక్కువ కేసులు ఎందుకు పెరుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు వైద్యాధికారులను ప్రశ్నించారు. కరోనా వైరస్ సోకుతున్న వారిలో, ఈ వైరస్తో మరణిస్తున్న వారిలో అత్యధిక శాతం మంది హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్నమరో మూడు జిల్లాల వారే ఉంటున్నారని వైద్యధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. కాబట్టి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో లాక్ డౌన్ను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని, ఎట్టి పరిస్థితుల్లో సడలింపులు ఇవ్వవద్దని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఉన్నతాది కారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.
లాక్డౌన్ ఆంక్షలు మరింత కఠిన తరం..
మరోవైపు కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ అమలుపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సోమవారం ప్రగతి భవన్ లో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, కుటుంబ సంక్షేమ కమిషనర్ యోగితా రాణి, సీనియర్ వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ఎనిమిది గంటల పాటు సాగిన సమీక్షలో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ నిబంధనల సడలింపు అంశాలు చర్చకు వచ్చాయి. సోమవారం మూడు కేసులు నమోదు కావడం, 40 మంది కోలుకుని డిశ్చార్జి కావడం శుభసూచకమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వైద్యశాఖ అధికారులనుండి తాజా పరిస్థితిపై నివేదిక తెప్పించుకుని సీఎం పరిశీలించారు.
కరోనా వైరస్ ను కట్టడి చేయాలి..
తెలంగాణలో ఓసారి కేసులు పెరుగుతూ, మరోసారి తగ్గుతూ ఉన్నాయి. తాజాగా 3 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా 40 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1085కి చేరింది. వీరిలో కరోనాతో పోరాడుతూ ఇప్పటి వరకు 585 మంది కోలుకోగా, 29 మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 471 కరోనా యాక్టివ్ కేసులున్నట్టు ముఖ్యమంత్రి స్పష్టం చేస్తున్నారు. ఎండలు తమ ప్రతాపాన్ని చూపిస్తున్న తరుణంలో తెలంగాణలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని సీఎం కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఆందోళనకరంగా మారిన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో ఆంక్షలను మరింత కట్టుదిట్టం చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీ చేసారు.