జూన్ 4 వరకు లాక్డౌన్ ..?, కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలు కంటిన్యూ , ఇవాళ్టి క్యాబినెట్లో నిర్ణయం...?
తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ జూన్ 4వ తేదీ వరకు పొడిగించాలని ప్రభుత్వం భావిస్తోన్నది. రాష్ట్రంలో ఈ నెల 29వ తేదీ వరకు లాక్డౌన్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ను ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించడంతో.. తెలంగాణ రాష్ట్ర నిర్ణయం ఏ విధంగా ఉంటుందనే చర్చకు దారితీసింది. వాస్తవానికి రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు కూడా తగ్గడం లేదు. దీంతో ఈ నెల 29వ తేదీ నుంచి మరో వారం అంటే.. జూన్ 4వ తేదీ వరకు లాక్ డౌన్ అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
కరోనా లాక్డౌన్: మే 31 వరకు పొడగింపు.. బస్సులకు గ్రీన్ సిగ్నల్, రైళ్లకు నో.. కొత్త గైడ్లైన్స్ ఇవే..
మంత్రివర్గ సమావేశం
లాక్ డౌన్ పొడగింపుపై సోమవారం సాయంత్రం మంత్రివర్గ సమావేశం నిర్వహించిన తర్వాత సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని వెలువరిస్తారు. వాస్తవానికి ఆదివారం సాయంత్రం పోతిరెడ్డిపాడు అంశంపై పరివాహక ప్రాంత మంత్రులతో కేసీఆర్ చర్చించారు. సమావేశం జరుగుతున్న సమయంలోనే.. లాక్ డౌన్ 4.0 నిబంధనలను కేంద్రం విడుదల చేసింది. దీనిపై అప్పుడే కేసీఆర్ చర్చించి.. పొడిగిస్తేనే బాగుంటుందని అనుకున్నారని సమాచారం. కానీ కొద్ది మంది మంత్రులే ఉండటంతో.. సోమవారం సాయంత్రం క్యాబినెట్ నిర్వహించి నిర్ణయం వెలువరించాలని డిసైడైనట్టు విశ్వసనీయ సమాచారం.
కరోనా కలవరం..
తెలంగాణ రాష్ట్రంలో గత వారం కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రోజుకు 40కి తక్కువ కాకుండా కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసులన్నీ దాదాపుగా జీహెచ్ఎంసీ పరిధిలోనే రికార్డమవుతున్నాయి. కంటైన్మెంట్ జోన్లు అన్నీ కూడా గ్రేటర్ పరిధిలోనే ఉన్నాయి. దీంతో మరింత పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. మిగతా పాజిటివ్ కేసులు మహారాష్ట్ర నుంచి వచ్చినవారి వల్ల వస్తున్నాయి. వారు గ్రేటర్ పరిధిలోనే గాక.. మిగతా జిల్లాలకు వెళుతున్నారు. జగిత్యాల జిల్లాలో 11 పాజిటివ్ కేసులు కూడా ముంబై నుంచి వచ్చినవారి వల్లేనని నిర్ధారణ అయ్యింది. దీంతో మరింత పకడ్బందీగా చర్యలు తీసుకునే అంశంపై మంత్రివర్గ సమావేశంలో డిస్కస్ చేయనున్నారు.
బస్సులకు అనుమతి...?
గ్రీన్, ఆరంజ్తోపాటు రెడ్ జోన్లలో కూడా షాపులు తెరిచేందుకు కేంద్రం అనుమతించింది. కంటైన్మైంట్ జోన్లలో మాత్రం ఆంక్షలు యథావిధిగా అమలవుతాయి. దీంతో గ్రీన్, ఆరంజ్ జోన్లలో బస్సులు నడిపై అంశంపై కూడా కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. గ్రేటర్ పరిధిలో తప్ప.. రాష్ట్రంలో బస్సుల రవాణాకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.
Recommended Video
నిరాడంబరంగా..?
కొద్దిరోజుల్లో జరగనున్న రాష్ట్ర అవరతణ వేడుకలు కూడా సింపుల్గా నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. నిరాడంబరంగా నిర్వహించాలని తన సన్నిహితులతో చెప్పినట్టు తెలిసింది. పబ్లిక్ గార్డెన్స్, జిల్లా కేంద్రాల్లో వేడుకలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వరు. ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రం జాతీయ జెండా ఎగరవేసేందుకు పర్మిషన్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఎట్ హోం, కవి సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండే అవకాశం ఉంది.