తెలుగు రాష్ట్రాలతో పాటు తొలిదశలో ఎక్కడెక్కడ పోలింగ్ ఉందో తెలుసా? అందులో తెలంగాణే టాప్!
న్యూఢిల్లీ: అయిదేళ్లకోసారి వచ్చే ఓట్ల పండుగ మరికొన్ని గంటల్లో ఆరంభం కాబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి దశలోనే పోలింగ్ నిర్వహిస్తుండటం ఓ విశేషమే. ఎందుకంటే- ఉమ్మడి రాష్ట్రంలో రెండు దశల్లో పోలింగ్ ను నిర్వహించేవారు. విభజన అనంతరం రెండు రాష్ట్రాల్లో ఒకేరోజు, ఒకేసారి పోలింగ్ పూర్తి కానుంది. తెలంగాణలో 17 లోక్ సభ నియోజకవర్గాలు, ఏపీలో 25 లోక్ సభ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ సీట్లకూ పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ రెండింటితో పాటు తొలిదశలో మొత్తం 20 రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సమాయాత్తమయ్యారు.
20 రాష్ట్రాలు..91 లోక్ సభ స్థానాలు..
ఏపీ, తెలంగాణ సహా అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బిహార్, ఛత్తీస్ గఢ్, జమ్మూకాశ్మీర్, లక్షద్వీప్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయా, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, సిక్కిం, త్రిపుర, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో తొలిదశలో పోలింగ్ నిర్వహించబోతున్నారు. వీటిల్లో ఏపీ, తెలంగాణలో తొలిదశలోనే పోలింగ్ ముగుస్తుంది. అస్సాం, బిహార్, ఛత్తీస్ గఢ్, జమ్మూకాశ్మీర్, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లల్లో దశలవారీగా లోక్ సభ నియోజకవర్గాల్లో ఎన్నికలను నిర్వహిస్తారు. వీటిల్లో ఏపీతో పాటు ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లల్లో అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ నిర్వహించనున్నారు. ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలను నాలుగు దశల్లో చేపట్టారు.
అత్యధికం తెలంగాణ..
అత్యధికంగా తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు దరఖాస్తులు దాఖలయ్యాయి. 17 లోక్ సభ నియోజకవర్గాల్లో మొత్తం 443 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, మజ్లిస్ సహా స్వతంత్ర అభ్యర్థులు చాలామంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. లోక్ సభ స్థానాలకు అత్యధికంగా దరఖాస్తులను దాఖలు చేసిన జాబితాలో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. 25 సీట్ల కోసం 319 మంది అభ్యర్థులు బరిలో నిల్చున్నారు. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం అభ్యర్థులు రేసులో ఉన్నారు. ప్రధానంగా టీడీపీ, వైఎస్ఆర్ సీపీ మధ్యే పోటీ ఉంటుందని రాజకీయ వర్గాల విశ్లేషణ.
9000 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
రాష్ట్రంలో తొమ్మిది వేల వరకు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వివరించారు. చాలామటుకు జిల్లాల్లో పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచబోతున్నామని ఎన్నికల ప్రధానాధికారి ఇదివరకే వెల్లడించారు. 46,397 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 4,619, విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 2,304 అదనపు పోలింగ్ కేంద్రాలను నెలకొల్పారు. వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. పోలింగ్ సరళిని వీడియోలు తీయడంతో పాటు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను మైక్రో అబ్జర్వర్లుగా నియమించడానికి చర్యలు తీసుకున్నారు.