ఇద్దరు కాదు.. ముగ్గురు: మళ్లీ రేవంత్ సంచలనం వ్యాఖ్యలు, విశ్వేశ్వర్ రెడ్డి ఊహించని ట్విస్ట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితికి చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర రెడ్డి మంగళవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెండ్ రేవంత్ రెడ్డి స్పందించారు. తాను చెప్పిందే నిజం అవుతోందని చెప్పారు. తాను గతంలో ఇద్దరు ఎంపీలు పార్టీ మారుతారని చెప్పానని, కానీ ఇద్దరు కాదని, ముగ్గురు కాంగ్రెస్లో చేరుతారని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
చదవండి: తెరాసలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యల కుదుపు: మైండ్ గేమ్ వద్దని ఎంపీల తీవ్ర హెచ్చరిక
కొండా విశ్వేశ్వరరెడ్డి దారిలోనే మరో ఇద్దరు ఎంపీలు తెరాసకు రాజీనామా చేస్తారని చెప్పారు. డిసెంబర్ 7వ తారీఖు డెడ్లైన్ అని చెప్పారు. తెరాస నుంచి మరో రెండు వికెట్లు పడబోతున్నాయన్నారు. తాను చెప్పినపుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదన్నారు. ఆ ఎంపీలు పార్టీ మారినప్పుడు అందరికీ అర్థమవుతుందని తెలిపారు.
చదవండి: కేసీఆర్కు సవాల్ విసిరి అన్నంత పని చేసిన రేవంత్ రెడ్డి, కొండా తర్వాత మరొకరు ఎవరు?
మరో ఇద్దరు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు
మిగతా ఇద్దరు నేతలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నప్పుడు మీకు అర్థమవుతుందని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత తొలిసారి తెలంగాణకు వస్తోన్న సోనియా గాంధీకి ఘన స్వాగతం పలకాలని ప్రజలను కోరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించడం ద్వారా సోనియా రుణం తీర్చుకోవాలన్నారు. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణను తన కుటుంబ విలాస జీవితం కోసం కేసీఆర్ వినియోగించుకున్నారన్నారు.
బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలన
ఈ నెల 23వ తేదీన మేడ్చల్లో తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ బహిరంగ సభలో పాల్గొంటారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఆయన ఈ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రచారంలో భాగంగా కేసీఆర్ పైన తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. కేటీఆర్ను సీఎంను చేసేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నమే ముందస్తు ఎన్నికల నాటకమని, అధికారంలో ఉన్నప్పుడు రూ.2 లక్షల కోట్ల పనులకు టెండర్లు పిలిచారని, తద్వారా పది శాతం కమీషన్ లెక్కన రూ.20 వేల కోట్లు దోచుకున్నారని, అధికారంలోకు వస్తేనే రాజకీయాల్లోనే కొనసాగుతారా, ప్రజలు తిరస్కరిస్తే దోచుకున్న సొమ్ముతో విదేశాలకు పారిపోతారా? అంటూ కేసీఆర్, కేటీఆర్లను ఉద్దేశించి రేవంత్ సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలకు ముందే కేటీఆర్కు రెడ్కార్నర్ నోటీసులు జారీ చేయాలన్నారు. ఇన్నాళ్లూ దోచుకుని ఇప్పుడు కేటీఆర్ రాజకీయ సన్యాసం అంటే కుదరదని, దోచుకున్న దాన్ని మిత్తితో సహా రాబడతామన్నారు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎంపీలను, ఇతర రాజకీయ నేతలను కొనుగోలు చేయగలరేమో కానీ కొడంగల్ ప్రజలను మాత్రం కొనలేరన్నారు.
అందుకే పార్టీ వీడాలని నిర్ణయం
కాగా, చేవేళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి తెరాసకు రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను తెరాస భవన్ పంపించారు. అందులో తన రాజీనామాకు గల కారణాలను వివరించారు. తనకు ఓడిపోయే సీటును కేటాయించినప్పటికీ తన కష్టంతో, ప్రజల ఆశీర్వాదంతో గెలిచానని చెప్పారు. పార్టీలో తనకు సరైన గౌరవం లేదన్నారు. వివిధ సందర్భాల్లో తనకు ఎదురైన అనుభవాలతో పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చానని చెప్పారు. తెలంగాణ సాధన కోసం పోరాడిన కార్యకర్తలకు అన్యాయం జరిగిందని, తెలంగాణ ఆకాంక్షలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారికి కేబినెట్లో చోటు కల్పించారన్నారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నవారికి ప్రాధాన్యత ఇచ్చారని, తెలంగాణ కోసం పోరాడిన వారి అవసరం తెరాసకు లేదని తనకు అన్పిస్తోందన్నారు.
గుర్తింపు ఉండటం లేదు
తెరాసలో సంప్రదాయ రాజకీయాలు లేవని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర, పార్టీ స్థాయిల్లో ఎలాంటి గుర్తింపు ఉండట్లేదని చెప్పారు. ఎంపీగా తన నియోజకవర్గ ప్రజలకు ఆశించిన స్థాయిలో పని చేశానని చెప్పారు. పార్టీ గత రెండేళ్లుగా ప్రజలకు దూరమవుతోందన్నారు. అనేక సందర్భాల్లో పార్టీకి, ప్రజలకు అగాథం పెరిగిపోయిందన్నారు. ప్రభుత్వం కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందన్నారు. తొలిసారిగా ఎంపీగా గెలుపొందినప్పటికీ పార్లమెంటులో 90సార్లు మాట్లాడానని, ఎయిమ్స్ సాధనలో కీలక పాత్ర పోషించానని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో కొనసాగలేనని చెప్పారు.
ఊహించని ట్విస్ట్, పెను సంచలనం
ఉద్యమ సమయంలో తెరాసలో చేరిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆ తర్వాత చేవెళ్ల లోకసభ స్థానం నుంచి పోటీ చేసి, గెలిచారు. రాజీనామాకు దారితీసిన కారణాలను ఆయన బుధవారం మీడియా ముందు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల రేవంత్.. ఇద్దరు ఎంపీలు తమ పార్టీలోకి వస్తారని చెప్పిన తర్వాత, కేటీఆర్తో కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం రేవంత్ వ్యాఖ్యలను ఖండించారు. కానీ నాలుగైదు రోజుల్లోనే ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. తద్వారా ఎన్నికలకు ముందు పెను సంచలనానికి కారణమయ్యారు.