టిడిపికి ఓటేస్తే టిఆర్ఎస్కు: జేపీ కొత్త పాట, లుకలుకలు: కెసిఆర్ ప్రెస్మీట్పై రేవంత్
హైదరాబాద్: లోక్సత్తా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ కొత్త పాట పాడారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే అధికార టిఆర్ఎస్కు వేసినట్లేనని ఆయన శుక్రవారం నాడు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వల్లే స్మార్ట్ సిటీ రాలేదు: రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం వల్లే తెలంగాణకు స్మార్ట్ సిటీ రాకుండా పోయిందని తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కెసిఆర్కు ప్రజలు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలన్నారు. కెసిఆర్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే టిడిపి ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇచ్చిందన్నారు.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రతిపక్ష పార్టీల పైన సీఎం కెసిఆర్ వ్యాఖ్యానించారన్నారు. నిన్నటి ప్రెస్ మీట్లో తెరాసలోనే లుకలుకలు ఉన్నట్లుగా బహిర్గతమైందన్నారు. గ్రేటర్ సీట్లలో గెలుపుపై తండ్రీ, కొడుకు, కూతురు మధ్య సమన్వయం లేదన్నారు.
ఒకరి అభిప్రాయాలతో మరొకరు ఏకీభవించడం లేదన్నారు. గ్రేటర్లో మజ్లిస్ పార్టీతో సంబంధం లేకుండా సీట్లు సాధిస్తామని గతంలో కెటిఆర్ చెప్పారని, మరోవైపు మజ్లిస్ మిత్రపక్షమని కెసిఆర్ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. టిఆర్ఎస్, మజ్లిస్ కూటమిగా ఏర్పడ్డాయన్నారు.
ఈ విషయంలో మంత్రి కెటిఆర్, ఎంపీ కవిత ప్రజలను మభ్యపెట్టారన్నారు. కరవు సమయంలోను విద్యుత్ ఇచ్చిన ఘనత టిడిపి ప్రభుత్వానిదే అన్నారు.
మజ్లిస్ మిత్ర పక్షమే: డి శ్రీనివాస్
మజ్లిస్ పార్టీ తమకు మిత్రపక్షమేనని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, టిఆర్ఎస్ నేత డి శ్రీనివాస్ శుక్రవారం అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ఓటు వేసేందుకు ప్రజలు ఆత్రుతగా ఉన్నారన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ప్రజలు విశ్వాసంతో ఉన్నారని, అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇస్తామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుకెళ్తున్నారని చెప్పారు. మంత్రి కేటీఆర్ రోడ్షోలకు మంచి స్పందన వస్తోందన్నారు.
టీఆర్ఎస్కు ఎంత స్పందన వస్తుందో అదేవిధంగా ఓటింగ్ శాతం ఉండాలన్నారు. ప్రతిపక్షాలు ఊహించని విధంగా మేనిఫెస్టో రూపొందించారని, ఏ ఆధారంతో వాటిని అమలు చేస్తారో చెప్పాలన్నారు. గ్రేటర్లో టీఆర్ఎస్ను గెలిపిస్తేనే ప్రభుత్వ పథకాలు సరిగ్గా అమలవుతాయన్నారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్తోనే నగరాభివృద్ధి సాధ్యమన్నారు. మజ్లిస్ పార్టీ తమకు మిత్ర పక్షమే అన్నారు.