కాపు.. కుల రాజకీయాలపై జెపి: దాడి.. టిఆర్ఎస్ ఎమ్మెల్యేకి చిక్కులు
హైదరాబాద్/మహబూబ్ నగర్: కుల రాజకీయాల పైన లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ శనివారం నాడు తన అసంతృప్తిని వ్యక్తం చేసారు. కులాల మధ్య చిచ్చుపెట్టే రాజకీయాలు ఎల్లకాలం సాగవని మండిపడ్డారు.
రాజస్థాన్లో గుజ్జర్లు, గుజరాత్తో పటేల్లు, ఏపీలో కాపులు, హర్యానాలో జాట్లు రిజర్వేషన్ల కోసం చేస్తున్న ఆందోళనలే ఇందుకు నిదర్శనమన్నారు. హర్యానాలో జాట్ల తాజా పోరాటం హింసాత్మకం కావటంపై మాట్లాడాదూ... పుట్టుకతో వివక్ష లేకుండా అందరికీ సమానావకాశాలు అందటానికి, పేదరికాన్ని నిర్మూలించడానికి అందరికీ నాణ్యమైన విద్య, ఆరోగ్యాన్ని అందించడం మినహా వేరే మంత్రం లేదన్నారు.
కాంగ్రెస్పై మండిపడ్డ బిజెపి
దేశ సమగ్రత, సమైక్యతకు సంబంధించిన అంశాల్లో కేంద్రంలోని ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరు దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా ఉందని బిజెపితెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మండిపడ్డారు. భావస్వేచ్ఛ పేరుతో కొన్ని రాజకీయ పార్టీలు కొంతమంది విద్యార్థులను పక్కదోవ పట్టిస్తున్నాయన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీకి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న గుర్తింపును చూసి ఓర్వలేక కాంగ్రెస్ ఇలాంటి కుటిల ప్రయత్నాలు చేస్తోందన్నారు. దేశ సమగ్రత, సమైక్యతకు ముప్పు వాటిల్లే అంశాలపై బిజెపి నాయకులు ప్రాణమున్నంత వరకు పోరాడుతారన్నారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 22న ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. బిజెపి శాసనసభాపక్షనేత లక్ష్మణ్ మాట్లాడుతూ.. పాలించే హక్కు మాకే ఉందనే భావనతో కాంగ్రెస్ వ్యవహరిస్తోందని. అందుకే వారిలో అసహనం కనిపిస్తోందన్నారు.
'ఎమ్మెల్యేను అరెస్టు చేయాలి'
మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట అటవీ అధికారిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని తెలంగాణ రాష్ట్ర జూనియర్ అటవీ అధికారుల సంఘం శనివారం డిమాండ్ చేసింది.
ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సమక్షంలో అతని అనుచరులు విధి నిర్వహణలో ఉన్న అటవీ రేంజ్ అధికారి రామేశ్వర్ రెడ్డిపై దాడికి పాల్పడ్డారని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్రబాబు ఆరోపించారు. దాడిని ఖండిస్తున్నామన్నారు. సోమవారం నాటికి ఎమ్మెల్యే, అతని అనుచరులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యోగులంతా సామూహిక సెలవులో వెళ్తామని హెచ్చరించారు.