లోకసభ ఎన్నికలు 2019: చేవెళ్ల నియోజకవర్గం గురించి తెలుసుకోండి
Recommended Video
తెలంగాణ రాష్ట్రంలోని 17 లోకసభ నియోజకవర్గాల్లో చేవెళ్ల ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో చేవేళ్ల ఏర్పడింది. 2002లో ఏర్పాటు చేయబడిన నియోజకవర్గాల పునర్విభజన కమిటీ చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాన్ని రికమండ్ చేసింది. దీంతో ఇది ఏర్పడింది.
ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తొలిసారి 2009లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున జైపాల్ రెడ్డి గెలిచారు. 2009 నుంచి 2014 వరకు పదిహేనో లోకసభకు ప్రాతినిథ్యం వహించారు. జైపాల్ రెడ్డి యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా పని చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో రాజకీయంగా ఢిల్లీ పెద్దలను ఒప్పించడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. 2009లో టీడీపీ నుంచి జితేందర్ రెడ్డి, బీజేపీ నుంచి బద్దం బాల్ రెడ్డి పోటీ చేశారు. జైపాల్ రెడ్డి (కాంగ్రెస్) విజయం సాధించారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజయం సాధించారు.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి తాత కొండా వెంకట రంగారెడ్డి పేరుతో రంగారెడ్డి జిల్లా పేరు పెట్టారు. తెలంగాణలోని రాజకీయ నాయకులలో అత్యంత ధనికుల్లో ఈయన ఉన్నారు. విశ్వేశ్వర్ రెడ్డి 1960 ఫిబ్రవరి 26న కొండా మాధవరెడ్డి (ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర మాజీ ప్రధాన న్యాయమూర్తి), జయలత దంపతులకు జన్మించారు. విశ్వేశ్వర్ రెడ్డి తాత కొండా వెంకట రంగారెడ్డి తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు.
2014 లోక్సభ ఎన్నికల్లో పటోళ్ల కార్తీక్ రెడ్డి (కాంగ్రెస్) పైన కొండా విశ్వేశ్వర్ రెడ్డి (టీఆర్ఎస్) 73 వేల ఓట్ల పై చిలుకు మెజార్టీతో గెలిచారు. గత ఎన్నికల్లో 13 మంది పోటీ చేశారు. ప్రధాన పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీల మధ్య ఉంది. కొండా విశ్వేశ్వర రెడ్డికి 4,35,077 ఓట్లు, కార్తీక్ రెడ్డికి 3,62,054 ఓట్లు, తూళ్ల వీరేందర్ గౌడ్ (టీడీపీ)కి 3,53,203 ఓట్లు వచ్చాయి.
చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం పరిధిలో 21,85,179 ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 11,53,049 కాగా, మహిళా ఓటర్లు 10,32,130. ఈ నియోజకవర్గంలోని జనాభా 23,52,131. ఇందులో గ్రామీణ ప్రాంతంలో నివసించే వారు 49.26% కాగా, పట్టణ ప్రాంతంలో నివసించే వారు 50.74%. ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గం 14.71% ఉండగా, ఎస్టీ సామాజిక వర్గం 5.70%గా ఉంది.
2014 ఎన్నికల్లో 13,15,862 ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే 60 శాతం ఓటింగ్ నమోదయింది. ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో పురుషులు 6,96,749, మహిళలు 6,19,113 ఉన్నారు.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి వృత్తిరీత్యా వ్యాపారవేత్త. పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. ఈయన పార్లమెంటులో 217 ప్రశ్నలు అడిగారు. తెలంగాణ యావరేజ్ 285గా ఉండగా, నేషనల్ యావరేజ్ 273గా ఉంది. 66 చర్చల్లో పాల్గొన్నారు. తెలంగాణ యావరేజ్ 36.7 శాతంగా ఉండగా, నేషనల్ యావరేజ్ 63.8గా ఉంది. మూడు ప్రయివేటు మెంబర్ బిల్స్ ప్రవేశపెట్టారు. ఇది తెలంగాణ యావరేజ్ 2, నేషనల్ యావరేజ్ కూడా 2గా ఉంది. 95 శాతం అటెండెన్స్ ఉంది. తెలంగాణ యావరేజ్ 69 శాతంగా ఉంది. తన నియోజకవర్గం అభివృద్ధికి ఎంపీ లాడ్స్ నుంచి 13.49 కోట్లు ఖర్చు చేశారు.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి అత్యంత ధనిక ఎంపీల్లో ఒకరు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఈయన అత్యంత ధనికులు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నియోజకవర్గం పరిధిలోనే ఐటీ కంపెనీలకు పేరుగాంచిన మాధాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్ ఉన్నాయి.