చేతులెత్తేసిన జేపీ: ఎన్నికల్లో పోటీ చేయం, ఎందుకు?
హైదరాబాద్: లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎన్నికల్లో లోక్సత్తా పార్టీ పోటీ చేయదని జయప్రకాశ్ నారాయణ ప్రకటించారు. మంగళవారం ఆయన హైదరాబాద్లో మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించామని, లోక్ సత్తాను రాజకీయ పార్టీగా చూడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల్లో పోటీ చేయకపోయినా రాష్ట్రాలు, స్థానిక సంస్థలకు అధికారాలు, ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. విద్య, ఆరోగ్యం కోసం నిరంతరం పోరాటం సాగిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, 2006లో లోక్సత్తా పార్టీని మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ స్థాపించారు.
ఆ తర్వాత 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజక వర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. శాసనసభలో తనదైన శైలిలో ప్రజా సమస్యలపై పోరాడారు. ఆ తర్వాత 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తెలంగాణలోని మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజక వర్గం నుంచి బరిలోకి దిగారు.
అయితే ఈ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నుంచి పార్టీ కార్యక్రమాలకు కాస్తంత దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా ఇప్పుడు లోక్సత్తా పార్టీ ఇకపై ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయదని ఆయన ప్రకటించారు. ప్రజలందరికి రాజకీయ, ఆర్థిక, సామాజిక సమానత్వం అందించాలనే ఉద్దేశంతో లోక్సత్తా పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే.