బ్రిటీష్ ఎయిర్వేస్ నిర్వాకం: శంషాబాద్లో 180మంది ప్రయాణికులకు చుక్కలు
హైదరాబాద్: బ్రిటిష్ ఎయిర్ వేస్ నిర్లక్ష్యం కారణంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సాంకేతిక కారణాలతో లండన్ వెళ్లాల్సిన విమానం నిలిచిపోవడంతో అందులోని ప్రయాణికులు బుధవారం ఉదయం నుంచి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
కాగా, బ్రిటీష్ ఎయిర్వేస్ సంస్థ నుంచి మాత్రం సరైన సమాధానం కూడా లేకపోవడంతో ప్రయాణికుల్లో మరింత అయోమయ పరిస్థితి నెలకొంది. విమానం ఎప్పుడు వెళ్తుందో స్పష్టమైన సమాచారం లేకపోవడంతో సుమారు 180మంది హోటల్లోనే బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో సంస్థ వ్యవహరిస్తున్న తీరుపై ప్రయాణికులు మండిపడుతున్నారు.
సాంకేతిక కారణాలతో..?
ఈ వివరాల్లోకి వెళితే.. సాంకేతిక కారణాలతో బ్రిటీష్ ఎయిర్ వేస్కు చెందిన విమానం శంషాబాద్ విమానాశ్రయంలోనే నిలిచిపోయింది. బుధవారం ఉదయం 3గంటల నుంచి సాయంత్రం వరకు కూడా విమానం పరిస్థితి గురించి సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు చుక్కలు చూస్తున్నారు.
అంతా అయోమయం
ఎప్పుడు బయలుదేరుతారో కూడా స్పష్టత నివ్వకపోవడంతో 180మంది ప్రయాణికులు గందరగోళంలో ఉన్నారు. ఉదయం ఏడు గంటల నుంచి ఇప్పటికీ స్పష్టత లేక ఇబ్బంది పడుతున్నారు. లండన్ వెళ్లాల్సిన బీఏ 277 బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానం ఉదయం 7 గంటల 20 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సి ఉంది.
తెల్లవారుము నుంచీ.. తీవ్ర ఇబ్బందులు
ఈ క్రమంలో మొత్తం 180 మంది ప్రయాణికులు బుధవారం తెల్లవారుజామున 3 గంటలకే విమానాశ్రయానికి చేరుకున్నారు. తనిఖీలు, ఇతర ప్రక్రియంతా పూర్తి చేసుకుని తీరా విమానంలో ఎక్కిన తర్వాత సాంకేతిక లోపాలు తలెత్తాయని చెప్పారు. ఆ తర్వాత ఏం చేస్తారో.. మళ్లీ ఎప్పుడు బయలుదేరుతారో చెప్పేవారు లేకపోవడంతో ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. చివరకు విమానం వెళ్లదని.. హోటల్ లో బస ఏర్పాటు చేస్తామని చెప్పారు. విమానానికి దూరంగా బస్సును నిలిపి హోటల్ కు బయలుదేరాలని చెప్పారు. విమానంలో ఎక్కించిన లగేజీలను కిందకు దించడానికి కూడా సహకరించే వారెవరూ లేకపోవడంతో ప్రయాణికులు ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఎప్పుడు వెళ్తామో.. ఆందోళనలో ప్రయాణికులు
మాదాపూర్లోని నోవాటెల్ హోటల్ కు ప్రయాణికులను తరలించిన బ్రిటిష్ ఎయిర్ వేస్ సిబ్బంది.. ఆ తర్వాత కనీస సమాచారం ఇవ్వకపోవడంతో.. గమ్య స్థానాలకు చేరుకోవాల్సిన ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో చావు కబురు చల్లగా చెప్పినట్లు.. విమానానికి మరమ్మతులు పూర్తయ్యాయని.. బుధవారం రాత్రి 2గంటలకు విమానం బయలుదేరుతుందని విమానాశ్రయం వర్గాలు చెబుతున్నాయి. అయితే బోర్డింగ్ పాస్లు తీసుకున్నారని విమానం మళ్లీ ఎప్పుడు బయలుదేరుతుందో కూడా తమకు సమాచారం ఇవ్వడం లేదని ప్రయాణికులు చెబుతున్నారు. టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేస్తే.. ఎలాంటి స్పందనా రాలేదని వాపోతున్నారు.