లుకౌట్ నోటీసులు : సుజనా చౌదరికి బిగ్ రిలీఫ్... న్యూయార్క్ పయనానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. లుకౌట్ నోటీసులు రద్దు చేయాలని సుజనా చౌదరి హైకోర్టును ఆశ్రయించగా... న్యూయార్క్ వెళ్లేందుకు న్యాయస్థానం ఆయనకు అనుమతినిచ్చింది. సుజనా గ్రూపు సంస్థలు బ్యాంకులకు రూ.5700 కోట్లు కుచ్చు టోపీ పెట్టాయన్న ఆరోపణలపై గతంలో సీబీఐ సుజనా చౌదరికి లుకౌట్ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం(నవంబర్ 13) ఆయన న్యూయార్క్ వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకోగా... అక్కడి అధికారులు అడ్డుకున్నారు. సీబీఐ లుకౌట్ నోటీసుల ఆధారంగా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన్ను విమానాశ్రయం నుంచి వెనక్కి పంపించారు.
మళ్లీ కమలాన్ని కెలికిన సాయిరెడ్డి.. ఈసారి టార్గెట్ సుజనా.. తొలిసారి వైసీపీ-బీజేపీ మధ్య నెత్తుటి వేటు
రెండు వారాల పాటు అనుమతి...
విమానాశ్రయంలో ఎదురైన షాక్తో సుజనా చౌదరి నేరుగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ జారీ చేసిన లుకౌట్ నోటీసులపై కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం... న్యూయార్క్ వెళ్లేందుకు ఆయనకు రెండు వారాల పాటు అనుమతినిచ్చింది. దీంతో సుజనాకు పెద్ద ఊరట లభించినట్లయింది. ప్రస్తుతం సుజనా గ్రూపు సంస్థల మోసాలపై ఈడీ,సీబీఐ విచారణ కొనసాగుతోంది.
డొల్ల కంపెనీల వ్యవహారం...
సుజనా చౌదరికి చెందిన పలు సంస్థల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గతంలో భారీ ఎత్తున సోదాలు జరిపింది. ఈ సోదాల్లో సుజనా గ్రూపు సంస్థలు రూ.5700 కోట్లు మేర బ్యాంకులను మోసం చేసినట్లు గుర్తించింది. బ్యాంకు రుణాల ఎగవేతకు సంబంధించి కీలక ఆధారాలు దొరికినట్లు తెలిపింది. ఆ తర్వాత మరోసారి జరిపిన సోదాల్లో పలు డొల్ల కంపెనీలు,ఖరీదైన కార్లను గుర్తించి సీజ్ చేసింది. మొత్తం 120 సంస్థల పేరుతో సుజనా లావాదేవీలు నిర్వహిస్తున్నారని... కానీ అందులో చాలావరకు సంస్థలు మనుగడలో లేవని ఆరోపించింది.
Recommended Video
గతంలో మూడు ఎఫ్ఐఆర్లు...
తప్పుడు పత్రాలతో బ్యాంకులను రూ.364కోట్లు మేర మోసం చేశారన్న బ్యాంకర్ల ఫిర్యాదుతో గతంలో బెంగళూరు సీబీఐ అధికారులు సుజనాపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. చెన్నైలోని బెస్ట్&క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ తప్పుడు పత్రాలతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు నుంచి రూ.133 కోట్లు, ఆంధ్రాబ్యాంకు నుంచి రూ.71 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకు నుంచి రూ.159 కోట్లు రుణం తీసుకున్నట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ.. సుజనా సంస్థల్లో సోదాలు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించింది.