నేడు పట్టాభిషిక్తుడు కానున్న రామయ్య
భద్రాద్రి : ఆదివారం నాడు అభిజిత్ లగ్నాన సుగుణాలరాశి సీతమ్మను పరిణయమాడిన శ్రీరామచంద్రుడు నేడు పట్టాభిషిక్తుడు కానున్నాడు. భద్రాద్రిలో అంగరంగవైభవంగా పట్టాభిషేక కార్యక్రమం జరగనుంది. శ్రీరామనవమి సందర్భంగా కల్యాణం నిర్వహించిన మిథిలా స్టేడియంలోనే ఈ క్రతువు నిర్వహించనున్నారు.
కన్నుల పండువగా సీతారాముల కల్యాణం
పవిత్ర నదీ జలాలతో అభిషేకం
పట్టాభిషేకానికి ముందు మేళతాళాల మధ్య స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకిలో మిథిలా స్టేడియానికి తీసుకురానున్నారు. అనంతరం విశ్వక్సేన ఆరాధనతో పట్టాభిషేక మహోత్సవం ప్రారంభంకానుంది. పవిత్ర నదీ జలాలతో అభిషేకం నిర్వహించి అష్టోత్తర, సహస్త్రనామ, సువర్ణ పుష్పార్చన జరుపుతారు. అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటలకు వెండి సింహాసనంపై శ్రీరామ చంద్రస్వామివారిని పట్టాభిషిక్తున్ని చేస్తారు.
రామదాసు చేయించిన నగలతో అలంకరణ
త్రేతాయుగంలో శ్రీరాముని పట్టాభిషేకం జరిగిన ముహూర్తంలోనే భద్రచలంలో కూడా ఆ తంతు నిర్వహించడం సంప్రదాయం. శ్రీ రాముడికి పట్టాభిషేక సమయంలో రామదాసు చేయించిన నగలను అలంకరించడం భద్రాద్రిలో ఆనవాయితీగా వస్తోంది. అర్చకులు స్వర్ణఛత్రం, స్వర్ణ పాదుక, రాజ దండ, రాజపట్ట, రాజముద్ర, సామ్రాట్ కిరీటం తదితర ఆభరణాల విశిష్టతను భక్తులకు వివరిస్తూ స్వామివారికి అలంకరిస్తారు. ఏటా స్వామివారి కల్యాణం మరుసటి రోజున నిర్వహించే పట్టాభిషేక సమయంలో స్వర్గను పారాయణం చేస్తారు.
హాజరుకానున్న గవర్నర్ నరసింహన్
భద్రాద్రి రాముడి పట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున గవర్నర్ నరసింహన్ హాజరుకానున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు.