దారితప్పిన యువతి, సాయం చేస్తానని ముందుకొచ్చిన ఆటోడ్రైవర్, లాడ్జ్కు తీసుకెళ్లి లైంగికదాడి...
దిశ ఘటన తర్వాత కూడా లైంగికదాడులు తగ్గడం లేదు. క్రూర మనస్తత్వం కలిగిన నీచులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఒంటరిగా ఆడది కనిపిస్తే చాలు అనుభవిద్దామని అనుకొంటున్నారు. యువతిపై ఆటోడ్రైవర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ నెల 8వ తేదీన జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విశ్వనగరి అని చెప్పుకుంటున్న భాగ్యనగర నడిబొడ్డున లైంగికదాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది.
నమ్మించి..
హైదరాబాద్ చంద్రాయణ్ గుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో యువతి (18) నివసిస్తోంది. ఆమె తన సోదరి (10) తీసుకొని బయటకొచ్చింది. అయితే వచ్చిన దారి మరచిపోయారు. ఇంటికెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆటో డ్రైవర్ వారిని గమనించాడు. సాయం చేస్తానని నమ్మించి.. దారుణానికి ఒడిగట్టాడు.
లాడ్జీలో..
యువతిని ఇంటికి తీసుకెళ్తానని నమ్మించాడు. నిజమేననుకొని వారు ఆటో ఎక్కారు. తర్వాత నాంపల్లిలోని ఒక లాడ్జీకి తీసుకెళ్లాడు. రాత్రి యువతిపై ఆటో డ్రైవర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. యువతిపై లైంగికదాడి జరిగిన సమయంలో ఆమె సోదరి నిద్రపోయింది. మరునాడు వారిని ఫలక్నుమా రైల్వేస్టేషన్ వద్ద వదిలేశాడు. తర్వాత యువతి తన కుటుంబసభ్యులకు ఫోన్ చేసింది. జరిగిన ఘటన గురించి వారికి వివరించింది.
కంప్లైంట్
యువతిపై లైంగికదాడి గురించి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి కనిపించడం లేదని 8వ తేదీ రాత్రి వారు కంప్లైంట్ చేశారు. ఆటో డ్రైవర్పై సంబంధిత సెక్షన్లపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. దిశ ఘటన జరిగిన తర్వాత 20 రోజులకు లైంగికదాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది. నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చినా మృగాళ్ల వైఖరిలో మాత్రం మార్పు రాలేదు.
నడిబొడ్డున
యువతిపై లైంగికదాడి సిటీలో జరగడం ఆందోళన కలిగిస్తోంది. దిశ ఘటన శివారులో జరిగితే.. యువతిపై నగర నడిబొడ్డున దారుణం జరిగింది. దీనిని ప్రజాసంఘాలు, మేధావులు ఖండిస్తున్నారు. మృగాళ్లపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.