కూతురి ప్రేమ కోసం.. వాటర్ ట్యాంక్ ఎక్కిన తల్లి..! వినూత్న పోరాటం
పెద్దపల్లి : ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తీరా పెళ్లి మాట ఎత్తేసరికి మొఖం చాటేస్తున్నాడు. వారం రోజుల కిందట పోలీస్ ఠాణాలో పంచాయితీ జరిగి స్పష్టమైన హామీ లభించినా ఇంతవరకు బాధితురాలికి న్యాయం జరగలేదు. ఆ క్రమంలో బుధవారం నాడు మరోసారి ఆందోళనకు దిగింది ప్రియురాలు.
పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన దామ అనూష.. అదే గ్రామానికి చెందిన అనవేని శ్రీకాంత్ మధ్య మూడేళ్లుగా ప్రేమ వ్యవహరం నడుస్తోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడేమో మొఖం చాటేస్తున్నాడు శ్రీకాంత్. అయితే వారం రోజుల కిందట వాటర్ ట్యాంక్ ఎక్కి సూసైడ్ చేసుకుంటానంటూ అనూష హెచ్చరించింది. స్థానికుల సమాచారంతో పెద్దపల్లి సీఐ నరేందర్ గ్రామానికి వెళ్లి న్యాయం చేస్తానని భరోసా ఇవ్వడంతో అనూష ఆ ప్రయత్నం విరమించింది.
Recommended Video
మంచిర్యాలలో కిలాడీ.. ఉద్యోగాల పేరిట బురిడీ.. కోటి రూపాయలకు పైగా మోసం
అయితే వారం రోజులు గడుస్తున్నా శ్రీకాంత్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అనూష మరోసారి ఆందోళనకు సిద్ధమైంది. వారం కిందట శ్రీకాంత్ తనను మోసం చేస్తున్నాడంటూ ఆత్మహత్యకు ప్రయత్నిస్తే న్యాయం చేస్తానని పోలీసులు హామీ ఇచ్చారని.. కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయింది. ఆ క్రమంలో ప్రియుడు శ్రీకాంత్ ఇంటి ఎదుట దీక్షకు దిగింది.
అదలావుంటే.. అనూష తల్లి సైతం ఆమె ఆందోళనలో భాగమయ్యారు. తన కూతురుకు న్యాయం జరగకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ వాటర్ ట్యాంక్ ఎక్కడంతో గ్రామంలో అలజడి నెలకొంది. అనూషకు న్యాయం చేయాల్సిందేనంటూ గ్రామస్తులంతా ముక్తకంఠంతో మద్దతు పలికారు. అయితే తన ప్రియురాలు దీక్షకు దిగబోతుందనే సమాచారంతో శ్రీకాంత్ అలర్ట్ అయ్యాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లినట్లు సమాచారం. మొత్తానికి అనూష ప్రేమ పోరాటం యూ టర్న్ తీసుకోవడంతో మున్ముందు ఏం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంది.