వేర్వేరు పెళ్లిళ్లు.. మళ్లీ చిగురించిన పాత ప్రేమ.. చివరికిలా విషాదం..
వాళ్లిద్దరూ ఒకప్పుడు ప్రేమికులు. పెళ్లి చేసుకోవాలని ఇంట్లో నుంచి పారిపోయారు. కానీ పెద్దలు వారిని వెతికి పట్టుకుని గ్రామానికి తీసుకొచ్చారు. పెద్ద మనుషుల పంచాయితీ పెట్టి ఇద్దరినీ విడగొట్టారు. తర్వాత ఇద్దరికీ వేర్వేరు పెళ్లిళ్లు జరిగాయి. ఇద్దరికీ పిల్లలు పుట్టారు. కానీ అనూహ్యంగా మళ్లీ ఇద్దరూ ఒక్కటయ్యారు. పెళ్లి చేసుకోవాలని భావించారు. కానీ అది అసాధ్యమని తెలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
పదేళ్ల క్రితం ప్రేమ..
వరంగల్ అర్బన్ జిల్లా కమాలాపూర్ మండలం అంబాలకు చెందిన గండ్రకోట రాజు, అదే గ్రామానికి చెందిన మంత్రి రమ్య 10 ఏళ్ల క్రితం ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకునేందుకు ఇంట్లో నుంచి పారిపోయారు. కానీ ఇరువురి కుటుంబాలు వారిని వెతికి పట్టుకుని గ్రామానికి తీసుకొచ్చాయి. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇద్దరూ మరోసారి కలవకుండా గట్టిగా హెచ్చరించారు. అప్పటినుంచి ఎవరి దారి వారు చూసుకున్నారు.
వేర్వేరు వివాహాలు..
ఇదే క్రమంలో రమ్యకు వెలగొండకు చెందిన తిరుపతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కొంత కాలానికి తిరుపతి ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. దీంతో రమ్య అంబాలలోని పుట్టింటికి వచ్చి ఇద్దరు పిల్లలతో అక్కడే ఉంటోంది. కొంతకాలానికి అనారోగ్యంతో తిరుపతి చనిపోవడంతో ఆమె పుట్టింటికే పరిమితమైంది. ఇక రాజుకు భూపాలపల్లికి చెందిన ఓ యువతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కొన్నాళ్లు హైదరాబాద్లో ఉన్న రాజు.. ఆ తర్వాత భార్యాపిల్లలతో అంబాలకు వచ్చాడు. స్వగ్రామంలో ఇల్లు కట్టే పనుల్లో ఉన్నాడు.
చివరకు ఆత్మహత్య..
రాజు,రమ్య ఇద్దరూ అంబాలలోనే ఉంటుండటంతో ఇద్దరి మధ్య పాత ప్రేమ మళ్లీ చిగురించింది. అయితే విషయం తెలిసి ఇరువురి కుటుంబ సభ్యులు వారిని మందలించారు. దీంతో మనస్తాపం చెందిన ఇద్దరూ ఇళ్లు విడిచి ఎక్కడికో వెళ్లిపోయారు. రమ్య కుటుంబ సభ్యులు కమలాపూర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కూడా నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ధర్మారం శివారులోని ఓ చెరువు కుంటలో వారి మృతదేహాలను గుర్తించారు. ఆత్మహత్యకు పాల్పడ్డారని నిర్దారించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రమ్య ఆత్మహత్యతో ఆమె పిల్లలు తల్లిదండ్రి లేనివారుగా మిగిలిపోయారు. ఇటు రాజు పిల్లలకు తండ్రి దూరమయ్యాడు. ఇరువురి కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.