పారిపోయిన జంట... అమ్మాయి కుటుంబం దాడి... కొడుకు ప్రేమకు తండ్రి బలి...
ఇటీవలి కాలంలో ప్రేమ వ్యవహారాలు హత్యల దాకా వెళ్తున్న ఘటనలు తరుచుగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట ఇటీవల ఇంటి నుంచి పారిపోగా... అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయి ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో అబ్బాయి తండ్రి తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా బోయినిపల్లి మండలం స్తంభంపల్లి గ్రామానికి చెందిన గౌతమి అనే యువతి,మహేష్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ విషయం ఇంట్లో చెప్పగా అమ్మాయి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో దసరా పండుగ నాడు మహేష్,గౌతమి ఇద్దరూ ఊరు వదిలి పారిపోయారు.
అప్పటినుంచి గౌతమి కుటుంబం మహేష్పై ఆగ్రహంతో రగిలిపోతోంది. తమ బిడ్డను బలవంతంగా లాక్కెళ్లాడని ఆరోపిస్తోంది. ఈ క్రమంలో గౌతమి కుటుంబం,బంధువులు కలిసి ఇటీవల మహేష్ ఇంటిపై దాడి కూడా చేశారు. ఆ సమయంలో మహేష్ తండ్రి లక్ష్మీ నారాయణ ఇంట్లోనే ఉండగా... ఆయనపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన లక్ష్మీనారాయణ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. శుక్రవారం(అక్టోబర్ 30) ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలోనే మృతి చెందారు.
లక్ష్మి నారాయణ మృతితో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కొడుకు ప్రేమ తండ్రిని బలి తీసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.