మరో పరువు హత్య: ప్రేమ వివాహం చేసుకుందని.. మేనమామలే కాలయములై..
ప్రేమ వివాహం చేసుకుని, తమ పరువును మంటకలిపిందన్న అక్కసుతో యువతి బంధువులు నూతన దంపతులను హతమార్చిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం వెంకటంపల్లిలో చోటుచేసుకుంది.
వేములవాడ: ప్రేమ వివాహం చేసుకుని, తమ పరువును మంటకలిపిందన్న అక్కసుతో యువతి బంధువులు నూతన దంపతులను హతమార్చారు. ఈ పరువు హత్య రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం వెంకటంపల్లిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... వెంకటంపల్లికి చెందిన హరీష్(23 ), రచన(21 ) నెల రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే తమను కాదని రచన ప్రేమించి పెళ్లిచేసుకోవడం ఆమె మేనమామలైన నాగరాజు, శేఖర్, అశోక్ భరించలేకపోయారు.
గురువారం సాయంత్రం కొత్త దంపతులపై కత్తులతో దాడి చేసి వారిని హతమార్చారు. అంతేకాదు, వీరి వివాహానికి సహకరించిన వేములవాడ మండలం మారుపాకకు చెందిన మల్లేశం అనే వ్యక్తిని సైతం మట్టుబెట్టేందుకు ప్లాన్ వేశారు.
ఈ మేరకు సమాచారం అందడంతో వేములవాడ పోలీసులు మల్లేశంను తమ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. రచన దంపతుల హత్యకు ప్రేమ వివాహమే కారణమని స్థానికులు చెబుతున్నారు.