ప్రేమ-మోసం: పెళ్లాడాలని ప్రియుడి ఇంటి ముందు యువతి దీక్ష
ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతో ఓ యువతి అతని ఇంటి ఎదుట పురుగుల మందు డబ్బాతో దీక్షకు దిగిన సంఘటన మండలంలోని గంగిరేణిగూడెం గ్రామంలో శుక్రవారం జరిగింది.
వరంగల్: ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతో ఓ యువతి అతని ఇంటి ఎదుట పురుగుల మందు డబ్బాతో దీక్షకు దిగిన సంఘటన మండలంలోని గంగిరేణిగూడెం గ్రామంలో శుక్రవారం జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం గంగిరేణిగూడెం గ్రామానికి చెందిన పల్లాల రేఖ, పెరుమాండ్ల రాజు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
ఈ క్రమంలో రాజుకు 6 నెలల క్రితం నిశ్చితార్థం కావడంతో తనను పెళ్లి చేసుకోవాలని అడిగినట్లు బాధితురాలు పేర్కొంది. అతను పెళ్ళి చేసుకుంటానని చెప్పి.. కుటుంబ సభ్యులు కుదిర్చిన వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నట్లు తెలిపింది. జనవరి 22న పెళ్లికి సంబంధానికి కార్యక్రమాలు ఉన్నట్లు తెలియడంతో పెద్దల సమక్షంలో పిలిపించి మాట్లాడినప్పటికీ పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో 19న రాత్రి ప్రియుడి ఇంటి ఎదుట మౌనదీక్షకు దిగినట్లు రేఖ పేర్కొంది.
ఈ క్రమంలో పెద్దల వద్దకు వచ్చి పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నట్లు తెలిపింది. ఇటీవల పెళ్ళి గురించి అడుగగా ఒప్పుకోకపోవడంతో పాటు కేసు పెట్టుకొమ్మని రాజుతోపాటు కుటుంబసభ్యులు అంటున్నారని పేర్కొంది.
ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోకపోవడంతో న్యాయం కోసం అతని ఇంటి ఎదుట శుక్రవారం దీక్షకు దిగినట్లు తెలిపింది. కాగా, బాధితురాలికి మద్దతుగా ఆ గ్రామ సర్పంచ్ పోతు కృష్ణమూర్తి, జాగృతి నాయకులు అమ్మ అశోక్ తదితరులు దీక్షలోకూర్చున్నారు.