లవర్స్ ను టార్గెట్ చేసి మామూళ్లు గుంజుతోన్న పోలీసులు!?
హైదరాబాద్ : నయానో భయానో చిల్లర వ్యాపారుల వద్ద నుంచి పోలీసులు మామూళ్లు వసూలు చేసిన ఘటనలు ఇప్పటిదాకా చూసుంటాం. కానీ కొంతమంది తెలివిమీరిన పోలీసులు ప్రేమికులను సైతం టార్గెట్ చేసుకుని మామూళ్లు గుంజడానికి ప్రయత్నిస్తున్నారు.
తాజాగా రాజేంద్రనగర్ పరిధిలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. అత్తాపూర్ ఎర్రబోడ ప్రాంతానికి చెందిన ఓ ప్రేమ జంటను కానిస్టేబుల్ రవీందర్, హోంగార్డు పరిపూర్ణాచారి గతకొంత కాలంగా డబ్బుల కోసం వేధిస్తున్నారు. లక్ష రూపాయలు ఇవ్వాలని ప్రేమికులిద్దరిని వేధిస్తుండడంతో.. ఇప్పటిదాకా రూ.29వేలను ముట్టజెప్పారు ప్రేమజంట.
అయితే మిగతా డబ్బును కూడా త్వరగా ఇవ్వాలని ప్రేమికులను తీవ్రంగా వేధించుకు తినడం మొదలుపెట్టారు. ఫోన్లలో బెదిరింపులు ఎక్కువవడంతో.. ఇక చేసేదేమి లేక పోలీసులను ఆశ్రయించి తమ గోడు వెల్లబోసుకుంది సదరు ప్రేమ జంట. కాగా, ప్రేమజంట ఫిర్యాదుతో స్పందించిన పోలీస్ ఉన్నతాధికారులు కానిస్టేబుల్ రవీందర్, హోంగార్డు పరిపూర్ణాచారిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.