పెళ్లి బరాత్... ప్రియుడి ఎంట్రీతో అంతా తలకిందులు... చివరకు ఒంటరైన వధువు...
పెళ్లికి ముందే ఆమె ఓ అబ్బాయిని ప్రేమించింది. అయితే పెద్దలు ఒప్పుకోకపోవడం చేతనో... ప్రియుడితో విబేధాల కారణంగానో కుటుంబ సభ్యులు కుదిర్చిన పెళ్లికి అంగీకరించింది. తీరా పెళ్లయ్యాక అప్పగింతల సమయంలో కథ అడ్డం తిరిగింది. ఆమె ప్రేమించిన ప్రియుడు పెళ్లింటికి వచ్చి రచ్చ రచ్చ చేశాడు. చివరకు ఆమె కూడా ప్రియుడితోనే వెళ్తానని చెప్పడంతో పెళ్లి కొడుకు బిత్తరపోయాడు. వ్యవహారం పోలీస్ స్టేషన్కు చేరుకున్నాక... చివరకు వధువు మాత్రమే ఒంటరిగా మిగిలిపోయింది.
వివరాల్లోకి వెళ్తే... హుజూరాబాద్కు చెందిన దివ్య, వంశీ అనే యువకుడు ప్రేమించుకున్నారు. అయితే ఏ కారణాల వల్లనో దివ్య పెద్దలు కుదిర్చిన వివాహానికి అంగీకరించింది. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన బంధువుల అబ్బాయితో సోమవారం(అగస్టు 24) ఆమె పెళ్లి జరిగింది. వివాహా వేడుక సాఫీగానే సాగినప్పటికీ... తీరా అప్పగింతల సమయంలో ఆమె ప్రియుడు ఎంట్రీ ఇవ్వడంతో అంతా రచ్చ రచ్చయింది.
వధూవరుల ఊరేగింపుతో బరాత్ జరుగుతున్నప్పుడు... కారు వద్దకు వచ్చిన దివ్య ప్రియుడు ఆమెను కిందకు దించాడు. తాళి కట్టిన భర్త ముందే ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతను... నన్ను వదిలి వేరే పెళ్లి ఎలా చేసుకున్నావంటూ ప్రశ్నించాడు. ఆమెను తనకు అప్పగించి వెళ్లిపోవాలని పెళ్లి కొడుకుతో గొడవకు దిగాడు. ఇదంతా చూసి పెళ్లి కొడుకుకి నోట మాట రాలేదు.
Recommended Video
ఆ తర్వాత సీన్ పోలీస్ స్టేషన్కు మారింది. వంశీ తనపై దాడి చేశాడని ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేయడంతో అతనిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఇంతలోనే అక్కడికి వచ్చిన దివ్య... తాను ప్రియుడితోనే వెళ్తానని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో వధూవరులకు పోలీసులు రాత్రి వరకు కౌన్సెలింగ్ ఇచ్చినా లాభం లేకపోయింది. చివరకు వధువును వదిలేసి ప్రవీణ్,అతని కుటుంబ సభ్యులు మందమర్రికి వెళ్లిపోయారు. దివ్య తల్లిదండ్రులు కూడా ఆమెను వదిలేసి ఇంటికి వెళ్లిపోయారు. చివరకు పోలీస్ స్టేషన్లో ఆమె ఒంటరిగా మిగలడంతో కరీంనగర్లోని స్వధార్ హోమ్కి తరలించారు.